ఏఎన్నార్ 'మనం'తో నాగార్జున 'విక్రమ్' కనెక్షన్!
అక్కినేని నటశిఖరం ఏఎన్నార్ నటించిన చివరి సినిమాతో నాగార్జున నటించిన మొదటి సినిమాకి మధ్య కనెక్షన్ గురించి ఇప్పుడు అభిమానుల్లో ప్రత్యేకంగా చర్చ సాగుతోంది. నాగ్ `విక్రమ్` చిత్రంతో ఏఎన్నార్ 'మనం'కి ఉన్న కనెక్షన్ ఏమిటన్నది ఆరా తీస్తే తెలిసిన విషయం ఆశ్చర్యపరిచింది.;

అక్కినేని నటశిఖరం ఏఎన్నార్ నటించిన చివరి సినిమాతో నాగార్జున నటించిన మొదటి సినిమాకి మధ్య కనెక్షన్ గురించి ఇప్పుడు అభిమానుల్లో ప్రత్యేకంగా చర్చ సాగుతోంది. నాగ్ `విక్రమ్` చిత్రంతో ఏఎన్నార్ 'మనం'కి ఉన్న కనెక్షన్ ఏమిటన్నది ఆరా తీస్తే తెలిసిన విషయం ఆశ్చర్యపరిచింది. నాగార్జున 1986 మే 23న `విక్రమ్` చిత్రంతో తన నట జీవితాన్ని ప్రారంభించగా, సరిగ్గా 28 సంవత్సరాల తరువాత 2012 మే 23న `మనం` విడుదలైంది. ఈ చిత్రం నాగార్జున తండ్రి, లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం. ఈ చిత్రంలో అక్కినేని ఫ్యామిలీ హీరోలంతా నటించారు. ఏఎన్నార్- నాగార్జున-నాగ చైతన్య- అఖిల్ ఇందులో నటించడంతో 'మనం' అక్కినేని కుటుంబంలోని మూడు తరాలను కలిపింది. విక్రమ్ కె కుమార్ అక్కినేని కుటుంబానికి చిరస్మరణీయమైన విజయాన్ని అందించడం అతడి అదృష్టం.
నాగ్ తొలి చిత్రం విక్రమ్ ఏఎన్నార్ చివరి చిత్రం మనం మే 23న విడుదలవ్వడం అన్నది యాథృచ్ఛికమే అనిపించినా, అది తండ్రి కొడుకుల అనుబంధాన్ని హైలైట్ చేసింది. ఆ ఇద్దరి మధ్యా అభిరుచి కూడా దీనిని డ్రైవ్ చేసిందని అంగీకరించాలి. ఇద్దరిలో ఎవరికి ఏది నచ్చకపోయినా ఇది టేకాఫ్ అయ్యేది కాదు కదా! కానీ విక్రమ్ కె కుమార్ ఒప్పించాడు.. టేకాఫ్ చేయగలిగాడు. దివంగత నటుడు, దిగ్గజం ఏఎన్నార్ మాట్లాడుతూ.. `మనం` అక్కినేని కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. ఆయన తనను క్యాన్సర్ కబలిస్తోందని తెలిసినా కానీ, మొక్కవోని ధీక్షతో మనం చిత్రంలో నటించారు. అంతేకాదు చనిపోయే ముందు తాను ఇక ఎంతో కాలం ఉండనని కూడా ధైర్యంగా మీడియాని పిలిచి మరీ అధికారికంగా ప్రకటించిన ఏకైక మేరుపర్వతం అక్కినేని.
విక్రమ్- మనం కనెక్షన్ గురించి, చిరస్మరణీయ జ్ఞాపకాల గురించి నాగార్జున మాట్లాడుతూ.. నా తొలి చిత్రం , నాన్న గారి చివరి చిత్రం దశాబ్దాల వ్యవధిలో ఒకే రోజున విడుదల కావడం, మన కథను చెప్పే విధానంలా అనిపిస్తుంది, వారసత్వం, ప్రేమ, జీవితాంతం వృత్తి పట్ల నిబద్ధతకు సంబంధించిన కథ ఇది.. అని అన్నారు. అక్కినేని కుటుంబంలో హీరోల మనుగడ తరతరాల కనెక్షన్ ని కలిగి ఉండడం యాథృచ్ఛికం కాదేమో.. అది కాలం రాసిన చరిత్ర అని కూడా భావించాలి.
అక్కినేని నాగార్జున 39 సంవత్సరాల సినీ జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సెలబ్రేషన్ ఇద్దరు స్వయం ప్రకాశకులకు సంబంధించినది. నటశిఖరం ఏఎన్నార్ వారసత్వాన్ని నిలబెట్టిన కింగ్ నాగార్జున ఈరోజు వరుస పాన్ ఇండియా చిత్రాలతో అభిమానులను అలరించేందుకు ప్లాన్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. రజనీ కూలీలో నాగ్ పాత్ర చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని సమాచారం. మనం ఎంతటి ప్రత్యేకమైన జ్ఞాపకంగా మిగిలిందో ఇప్పుడు రజనీకాంత్ లాంటి లెజెండ్ తో నాగార్జున నటిస్తున్న కూలీ కూడా అంతే గొప్ప జ్ఞాపకంగా మిగలాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అక్కినేని కుటుంబానికి అది చాలా ప్రత్యేకమైనది కావాలని కోరుకుందాం.