యంగ్ హీరోని డీగ్రేడ్ చేయడమే అసలు ఉద్ధేశమా?
ఈ ఘటన రెండు విషయాలను స్పష్టం చేస్తోంది. బిజీగా ఉండే పబ్లిక్ ప్రదేశాల్లో ప్రజలు తమ పనుల్లో తాము ఉంటారు తప్ప, ప్రతి సెలబ్రిటీని వెంటనే గుర్తుపట్టే స్థితిలో ఉండకపోవచ్చు.;
యువహీరో వరుణ్ ధావన్ తన కెరీర్ బెస్ట్ హిట్ చిత్రంలో నటించాడు. మల్టీస్టారర్ చిత్రం `బార్డర్ 2` ఇటీవలే విడుదలై భారీ వసూళ్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వరుణ్ ధావన్ తన తదుపరి సోలో హిట్ కోసం తపించే సమయమాసన్నమైంది. ఇలాంటి సమయంలో అతడికి సరిగా గుర్తింపు లేదు! అంటూ ఒక పుకార్ ఇబ్బందికరంగా మారింది. యువహీరో వరుణ్ ధావన్ ఇటీవల ఒక రైల్వే స్టేషన్లో మాస్క్ తీసినా ఎవరూ గుర్తుపట్టలేదంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కలకలం రేపింది. దీని వెనుక ఉన్న అసలు వాస్తవాలను తెలుసుకుంటే నివ్వెరపోవాల్సిందే.
అయితే వరుణ్ ధావన్ అందరూ తనను గుర్తుపట్టాలని ఆశించి మాస్క్ తీశాడని, కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయనకు అవమానం జరిగినట్లుగా నెటిజన్లు వీడియోను షేర్ చేస్తున్నారు. అయితే వరుణ్ నిజంగానే గుర్తింపు కోరుకున్నాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అది కేవలం సోషల్ మీడియా, నెటిజనుల ఊహ మాత్రమే. ఈ రోజుల్లో చాలా మంది బాలీవుడ్ నటులు సామాన్యులలాగా పబ్లిక్ ప్రదేశాల్లో తిరగడానికి ఇష్టపడుతున్నారు. వరుణ్ కూడా ఏ హడావుడి లేకుండా, సెక్యూరిటీ లేకుండా సాధారణ ప్రయాణికుడిలా అక్కడ ఉన్నాడు. యువహీరో ఇబ్బంది పడ్డారనేది కేవలం ఇంటర్నెట్ సృష్టించిన ఒక కథనం మాత్రమే.
ఈ ఘటన రెండు విషయాలను స్పష్టం చేస్తోంది. బిజీగా ఉండే పబ్లిక్ ప్రదేశాల్లో ప్రజలు తమ పనుల్లో తాము ఉంటారు తప్ప, ప్రతి సెలబ్రిటీని వెంటనే గుర్తుపట్టే స్థితిలో ఉండకపోవచ్చు. రెండోది సెలబ్రిటీల సాధారణ విషయాలను కూడా వైరల్ జోకులుగా మార్చి, వారిని తక్కువ చేసి చూపే ధోరణి నెటిజన్లలో పెరుగుతోంది.
సోషల్ మీడియాలో క్లిక్స్ కోసం, వినోదం కోసం ఒక సాధారణ వీడియోకు రంగులు అద్ది వైరల్ చేశారు. వరుణ్ ధావన్ ఉద్దేశపూర్వకంగా గుర్తింపు కోసం ప్రయత్నించాడనే వాదనలో నిజం లేదని, అది కేవలం నెటిజన్ల అతిగా చేసిన విశ్లేషణ అని అర్థమవుతోంది.