అచ్చు గుద్దిన‌ట్టు ఈ న‌టుడు విరాట్ కోహ్లీలా

కెమెరాకు చిక్కిన అతడిని ఇప్పుడు భార‌తీయ‌ మీడియా వెంటాడి వేధిస్తోంది.;

Update: 2025-03-27 02:45 GMT

మ‌నిషిని పోలిన మ‌నుషులు ఏడుగురు ఉంటార‌ని చెబుతుంటారు. విరాట్ కోహ్లీని పోలిన ఏడుగురు ఈ ప్ర‌పంచంలో ఎక్క‌డెక్క‌డ ఉన్నారో క‌నిపెట్ట‌గ‌ల‌రా? ఇందులో ఒక‌రు ట‌ర్కీలో దొరికారు. కెమెరాకు చిక్కిన అతడిని ఇప్పుడు భార‌తీయ‌ మీడియా వెంటాడి వేధిస్తోంది.

ఈ ఫోటో బ‌య‌ట‌ప‌డ్డాక‌.. విరాట్ కోహ్లీ టర్కిష్ సినిమాలో నటిస్తున్నారా? అంటూ బోలెడన్ని కామెడీలు చేస్తున్నారు. భారత క్రికెటర్ కోహ్లీతో సిస‌లైన‌ పోలికను కలిగి ఉన్న టర్కిష్ నటుడిని చూసిన తర్వాత రెడ్డిట‌ర్లు చాలా సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. కోహ్లీకి ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ అభిమానులు ఉన్నారు. అత‌డు బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ‌ను పెళ్లాడాక ఈ ఫాలోయింగ్ మ‌రింత‌గా పెరిగింది. అయితే టర్కిష్ టెలివిజన్ సిరీస్ లో న‌టుడు స్టార్ క్రికెటర్ కోహ్లీని పోలి క‌నిపించ‌గానే నెటిజ‌నులు షాక‌య్యారు. ఇంట‌ర్నెట్ లో అత‌డి ఫోటోల‌ను కోహ్లీ ఫోటోల‌తో క‌లిపి పోల్చి చూస్తున్నారు.

సోమవారం, ఒక రెడ్డిట‌ర్ టర్కిష్ నటుడు కావిట్ సెటిన్ గునర్ నటించిన టర్కిష్ హిస్టారిక‌ల్ డ్రామా `దిరిలిస్: ఎర్టుగ్రుల్` నుండి స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసాడు. ``అనుష్క శర్మ భర్త టీవీ షో అరంగేట్రం`` అనే ట్యాగ్ ని స‌ర‌దాగా జోడించారు. దీనికి నెటిజ‌నుల నుంచి అసాధార‌ణ స్పంద‌న వ‌చ్చింది. చాలా మంది అభిమానులు ట‌ర్కిష్ న‌టుడు కోహ్లీతో చాలా పోలి ఉన్నారని అంగీకరించారు. రెడిట్ లో ఇంకా చాలా కామెడీలు క‌నిపిస్తున్నాయి. ``ఇది జోక్ కాదు. ఎర్టుగ్రుల్‌లో ఈ డోగన్ బే పాత్రను నేను మొదటిసారి చూసినప్పుడు... టర్కిష్ సిరీస్‌లో కోహ్లీ ఏం చేస్తున్నాడోన‌ని నాకు అనిపించింది? అచ్చం ఒక‌రినొక‌రు పోలి ఉన్నారు.. అని అన్నారు. మ‌రొక‌రు `టర్కిష్ కోహ్లీ` అని ఒక‌రు వ్యాఖ్యానించారు.

మెహ్మెట్ బోజ్‌డాగ్ నిర్మించిన టర్కిష్ సిరీస్ 2014లో మొదటిసారి ప్రసారం అయి ఐదు విజయవంతమైన సీజన్ల తర్వాత 2019లో ముగిసింది. ఇది చారిత్రక కాల్ప‌నిక అడ్వెంచ‌ర్ డ్రామా. ఇందులో ఎర్టుగ్రుల్ బే పాత్రలో ఇంజిన్ అల్తాన్ దుజ్యాతన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ షో ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఉస్మాన్ I తండ్రి ఎర్టుగ్రుల్ జీవితం ఆధారంగా రూపొందింది. ఈ సిరీస్ భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా అద్భుత‌మైన ప్రజాదరణ పొందింది.

వినోద పరిశ్రమతో విరాట్ కోహ్లీ అనుబంధాన్ని ప‌రిశీలిస్తే.. విరాట్ కోహ్లీ చాలా వాణిజ్య‌ ప్రకటనలలో కనిపించారు. అయితే అత‌డు ఎప్పుడూ సినిమా లేదా టీవీ షోలో నటించలేదు. ఇటీవల ఐపీఎల్ -2025 ప్రారంభోత్సవంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో కలిసి కోహ్లీ జూమ్ జో పఠాన్‌కు నృత్యం చేస్తూ సిగ్నేచర్ హుక్ స్టెప్‌ను ప్రదర్శిస్తూ కనిపించాడు. ఈ ఇద్ద‌రి ప్రదర్శన వీడియో వేగంగా వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో కలకలం రేపింది.

Tags:    

Similar News