ఇంకా డైలమాలో ఖాన్ల త్రయం మల్టీస్టారర్?
ఖాన్ ల త్రయం పనైపోయిందని ప్రచారం సాగుతోంది. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇప్పటికే ఫ్లాపుల్లో ఉన్నారు.;

ఖాన్ ల త్రయం పనైపోయిందని ప్రచారం సాగుతోంది. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇప్పటికే ఫ్లాపుల్లో ఉన్నారు. పఠాన్, జవాన్ తర్వాత సరైన బ్లాక్ బస్టర్ కోసం షారూఖ్ వేచి చూస్తున్నాడు. కానీ ఇప్పటికే ఖాన్లు షష్ఠిపూర్తి వయసులో ఉండటంతో వారిలో ఎనర్జీ లెవల్స్ పై సందేహాలున్నాయి. ఇలాంటి సమయంలో ఖాన్లు ముగ్గురూ కలిసి నటించే మల్టీస్టారర్ గురించి చర్చ సాగుతోంది.
అసలింతకీ ఖాన్ లు నటించే ఈ క్రేజీ మల్టీస్టారర్ పట్టాలెక్కేది ఎప్పటికి? అంటే దీనికి ఇప్పటికీ సమాధానం లేదు. పఠాన్ వర్సెస్ టైగర్ పేరుతో సల్మాన్- షారూఖ్ ఒకే సినిమాలో నటించే ఆలోచనతో ఉన్నారు. అలాగే ముగ్గురు ఖాన్ లు కలిసి నటించే సినిమా పైనా ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికీ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తాను చాలా ఆసక్తిగా ఉన్నానని ఇటీవలి ఇంటర్వ్యూలో చెప్పాడు. ముగ్గురు ఖాన్లు నటించే సినిమా చేయాలని ఉన్నా కానీ, ఇంకా స్క్రిప్టు దొరకలేదు.. దర్శకుడు దొరకలేదని చెప్పాడు.
తాజా ఇంటర్వ్యూలో పలు అంశాలపై అమీర్ చర్చించాడు. సల్మాన్, షారూఖ్ నటించిన సినిమాల్లో తనకు ఏవి ఇష్టమో అమీర్ చెప్పాడు. సల్మాన్ చిత్రాలలో భజరంగి భాయిజాన్, దబాంగ్ ఇష్టమైనవని అన్నాడు. షారుఖ్ విషయానికొస్తే దిల్వాలే దుల్హనియా లే జాయేంగే నిజంగా నచ్చింది. కుచ్ కుచ్ హోతా హై నాకు ఇష్టమైన అతని చిత్రాలలో ఒకటి. నేను అతడి ఇటీవలి చిత్రాలు పఠాన్, జవాన్ చూడలేదు అని అమీర్ అన్నారు. కానీ ఖాన్ లు ముగ్గురూ కలిసి నటించే సినిమాకి కథ కూడా దొరక్కపోవడం ఆశ్చర్యపరుస్తోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఆమీర్ ఖాన్ తన తదుపరి చిత్రం `సితారే జమీన్ పర్`ను విడుదల చేయనున్నారు. 20 జూన్ 2025 న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించారు. జెనీలియా దేశ్ ముఖ్ కీలక పాత్రలో నటించారు. షారుఖ్ ఖాన్ ప్రస్తుతం `కింగ్` సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఇందులో సుహానా ఖాన్ కీలక పాత్రను పోషిస్తోంది. సల్మాన్ సికందర్ ఫ్లాపయ్యాక, తదుపరి కిక్ 2ని తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాడు. సంజయ్ దత్ తో కలిసి ఓ యాక్షన్ చిత్రం కోసం చర్చలు జరుపుతున్నారని తెలిసింది.