కోటా శ్రీనివాసరావు జీవితంలో ముఖ్య ఘట్టాలు
తెలుగు సినిమా పరిశ్రమలో సుదీర్ఘ ప్రస్థానం కొనసాగించిన కోటా శ్రీనివాసరావు నేడు ఉదయం తెల్లవారుజామున మృతి చెందారు.;
తెలుగు సినిమా పరిశ్రమలో సుదీర్ఘ ప్రస్థానం కొనసాగించిన కోటా శ్రీనివాసరావు నేడు ఉదయం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన తన 83వ ఏట మృతి చెందారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యల కారణంగా కోటా మృతి చెందారు. ఆయన మృతిపై టాలీవుడ్ ప్రముఖులు మాత్రమే కాకుండా ఇతర భాషల సినీ ప్రముఖులు సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డ్ను అందుకున్న కోటా శ్రీనివాసరావు జీవితంలో ఎన్నో విజయాలు, మరెన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి. ఆయన వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన ఒడిదొడుకులు ఉన్నాయి. చేతికి అంది వచ్చిన కొడుకు మృతి చెందిన సమయంలో ఆయన గుండెలు పగిలేలా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి.
కోటా జీవితంలో ముఖ్య ఘట్టాలు..
ఆంధ్రప్రదేశ్లోని కంకిపాడు గ్రామంలో 1942 జులై 10న జన్మించారు.
కోటా తండ్రి సీతారామ ఆంజనేయులు వైద్యుడు.
డాక్టర్ కావాలని ఆశ పడ్డ కోటా శ్రీనివాసరావు నటనపై ఉన్న ఆసక్తితో చదువుపై శ్రద్ద పెట్టలేక పోయారు.
బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందిన కోటా శ్రీనివాసరావు కొన్నాళ్లు బ్యాంక్ ఉద్యోగిగా విధులు నిర్వర్తించారు.
రుక్మిణిని 1966లో వివాహం చేసుకున్న కోటా శ్రీనివాసరావుకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు కాగా ఒక కుమారుడు.
కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.
కోట ఆంజనేయ ప్రసాద్ 2010 జూన్ 20న హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
1978లో 'ప్రాణం ఖరీదు' అనే తెలుగు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.
2015 లో భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను భారతదేశపు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది.
కోటా అందుకున్న నంది అవార్డులు :
స్పెషల్ జ్యూరీ అవార్డు - ప్రతిఘటన (1985)
ఉత్తమ విలన్ - గాయం (1993)
ఉత్తమ విలన్ - తీర్పు (1994)
ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ - లిటిల్ సోల్జర్స్ (1996)
ఉత్తమ విలన్ - గణేష్ (1998)
ఉత్తమ విలన్ - చిన్నా (2001)
ఉత్తమ సహాయ నటుడు - పృథ్వీ నారాయణ (2002)
ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ - ఆ నలుగురు (2004)
ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ - పెళ్లయిన కొత్తలో (2006)
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ - ఉత్తమ సహాయ నటుడు - కృష్ణం వందే జగద్గురుమ్ (2012)
విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా కోటా శ్రీనివాసరావు 1999 నుంచి 2004 వరకు బాధ్యతలు నిర్వర్తించారు.