రూ.1.65 కోట్ల ఆఫర్.. మరో వ్యక్తితో బెడ్ పై..!
రూ.1.65 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినా కూడా బిగ్బాస్ షో కు వెళ్లేందుకు నిరాకరించినట్లు చెప్పుకొచ్చింది.;
బాలీవుడ్ బ్యూటీ తనూశ్రీ దత్తా చేసిన సినిమాలు కొన్నే అయినా ఎప్పటికీ గుర్తుండిపోయే వివాదాస్పద నటి అయింది. సినిమా ఇండస్ట్రీలో 2005లో ఎంట్రీ ఇచ్చింది. హిందీ మూవీ ఆషిక్ బనాయా ఆప్నే తో బాలీవుడ్కి పరిచయం అయిన తనూశ్రీ దత్తాకు వెంట వెంటనే ఆఫర్లు వచ్చాయి. లక్కీగా పరిచయం అయిన మొదటి ఏడాదిలోనే తెలుగులో స్టార్ హీరో బాలకృష్ణకు జోడీగా వీరభద్రుడు సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో తనూశ్రీ దత్తా కు తెలుగులో ఎక్కువ అవకాశాలు రాలేదు. ఈమె ఎక్కువగా హిందీ సినిమాలు చేసింది. తమిళ్లో ఒక సినిమా చేసినప్పటికీ అది పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. మీటూ ఉద్యమం సమయంలో ఈమె చేసిన సంచలన ఆరోపణల కారణంగా కొన్ని నెలల పాటు వార్తల్లో నిలిచింది. దీంతో సినిమాలో మళ్లీ బిజీ అవుతుందని అంతా భావించారు. కానీ సినిమా ఆఫర్లు ఎక్కువగా రాలేదు.
బిగ్బాస్ హౌస్కి వెళ్లేందుకు నిరాకరణ
వివాదం సృష్టించడానికి కారణం ఈమె బిగ్ బాస్ ఆఫర్ కోరుకుంటుందని, అందుకే వివాదంతో వార్తల్లో నిలిచిందని అప్పుడు అన్నారు. ఒక స్టార్ నటుడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అంత పెద్ద నటుడు నిజంగా అలా చేశాడా అని చాలా మంది ప్రశ్నించారు. ఆ సమయంలో ఆ నటుడి పైగా తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం వచ్చాయి. మొత్తానికి కొన్నాళ్ల పాటు బాలీవుడ్ను తనూశ్రీ దత్తా షేక్ చేసింది అనడంలో సందేహం లేదు. ఆ వివాదం అంతటికీ కారణం బిగ్బాస్ ఎంట్రీ కోసం అనే పుకార్లు షికార్లు చేశాయి. అవి పుకార్లే అని తేలిపోయింది. తనూశ్రీ దత్తకు వరుసగా 11 సీజన్లుగా బిగ్బాస్ టీం నుంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయట. తనూశ్రీ దత్తా వరుసగా 11 సీజన్లకు నో చెబుతూ వచ్చిందట. ఇటీవల ప్రారంభం అయిన షో కి ఏకంగా రూ.1.65 కోట్ల పారితోషికం ఆఫర్ చేయడం జరిగిందట.
తనూశ్రీ దత్తా కి బిగ్బాస్ టీం భారీ ఆఫర్
రూ.1.65 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినా కూడా బిగ్బాస్ షో కు వెళ్లేందుకు నిరాకరించినట్లు చెప్పుకొచ్చింది. తన పద్దతికి, తాను ఉండే విధానంకు బిగ్ బాస్ షో పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఆ రియాల్టీ షో లో ఒక వ్యక్తి పక్కన మరొకరు పడుకోవాల్సి ఉంటుంది. ఒకే బెడ్ పై మరో వ్యక్తితో నేను పడుకోలేను. ఒకే బెడ్ ను ఇతరులతో షేర్ చేసుకునేంత చీప్ రకం నేను కాదు అంటూ తనూశ్రీ దత్తా కాస్త సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఆట పేరుతో ఆడ, మగ కలిసి ఒకే హాల్ లో పడుకోవడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించింది. ఇలాంటి సంస్కృతి ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాంటి ప్లేస్ లో నేను ఒక్క రోజు కూడా గడపడం నాకు సాధ్యం కాదు. అందుకే నేను కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా కూడా బిగ్ బాస్ షో కి దూరంగానే ఉంటాను అంది.
మిస్ ఇండియా యూనివర్స్గా తనూశ్రీ దత్తా
1984లో జన్మించిన తనూశ్రీ దత్తా మోడల్గా కెరీర్ను ప్రారంభించింది. 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్ను గెలుచుకుంది. ఆ తర్వాత 2004లో ఈక్వెడార్లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలకు ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించింది. అక్కడ టాప్ 10 స్థానంతో సరి పెట్టుకుని వెనక్కు వచ్చింది. మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్ గెలుచుకోవడంతో బాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన తనూశ్రీ దత్త వెంటనే సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంది. 2005 నుంచి 2010 వరకు వరుసగా బాలీవుడ్ సినిమాలను చేసింది.
2009 సంవత్సరంలో ఒక సినిమా సెట్స్ లో సీనియర్ నటుడు తనను లైంగికంగా వేధించాడు అంటూ ఇంటర్వ్యూలో చెప్పడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విషయం బాలీవుడ్లో చర్చ జరుగుతూనే ఉంది. ఇండియాలో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసేందుకు తనూశ్రీ దత్తా వ్యాఖ్యలు ఆజ్యం పోసినట్లు అయింది. తనూశ్రీ దారిలో చాలా మంది సెలబ్రెటీలు తమ చేదు అనుభవాలను, తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులకు సంబంధించిన రహస్యాలను బయటకు చెప్పుకొచ్చారు.