కొలీగ్స్తో తమన్నా స్నేహం ఇలా కలిసొచ్చింది!
తమన్నా ఫైన్ జువెలరీ బ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్ కి హాజరైన వారిలో సిద్ధార్థ్ మల్హోత్రా, సమంత రూత్ ప్రభు,కాజల్ అగర్వాల్, ఆర్యన్ ఖాన్, ఫరా ఖాన్ , శిబానీ దండేకర్, అన్యా సింగ్, ప్రగ్యా యాదవ్ , ఫల్గుణి పీకాక్ (ప్రముఖ డిజైనర్), నచికేత్ బార్వే (డిజైనర్) తదితరులు ఉన్నారు.;
భారతదేశంలో అత్యంత లాభదాయక వ్యాపారం ఏది? అని ప్రశ్నిస్తే, జువెలరీ వ్యాపారం అని చాలా మంది చెబుతుంటారు. నమ్మకంగా లాభాలు ఇచ్చే వ్యాపారం బంగారం- ఆభరణాల వ్యాపారం. నైపుణ్యం, దక్షత ఉంటే ఈ రంగంలో ప్రవేశించిన ఎవరికీ అన్యాయం జరగదు. ఇప్పుడు దీనినే ఆలంబనగా చేసుకుని పలువురు కథానాయికలు జువెలరీ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నారు. అంబానీలు, రతన్ టాటాలే కాదు జువెలరీ రంగంలో చాలా దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. అయినా ఎప్పటికప్పుడు సెలబ్రిటీలు ఈ రంగంలో ప్రవేశిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.
తాజాగా తమన్నా భాటియా తన కొత్త జ్యువెలరీ బ్రాండ్ `తమన్నా ఫైన్ జ్యువెలరీ`(టీజే) స్టోర్ను ముంబై జుహులో ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. స్టోర్ లాంచ్ కి హాజరైన వారిలో పలువురు అందాల కథానాయికలు ఉన్నారు. పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్, ఫాతిమా సనా షేక్ సహా పలువురు అందాల భామలు స్టోర్ లాంచ్ లో సందడి చేయగా వారి నడుమ సఖ్యత ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఫాతిమా, మృణాల్ లతో తమన్నా స్నేహం అందరినీ ఆశ్చర్యపరచగా, పూజా హెగ్డే మాత్రం కాస్తంత దూరంగానే నిలబడి ఫోజులిచ్చింది. అయితే మిల్కీ బ్యూటీ తన సహచరులందరితో ఎంత స్నేహంగా ఉంటుందో ఈ ప్రచార వేదిక స్పష్ఠంగా చెబుతోంది. తన కొలీగ్ కోసం ఇంతమంది భామలు నమ్మకంగా లాంచింగ్ ఈవెంట్ కి వచ్చి సహకరించారంటే అది తమన్నా కలుపుగోలుతనం ఫలితం అని అనుకోవాలి.
తమన్నా ఫైన్ జువెలరీ బ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్ కి హాజరైన వారిలో సిద్ధార్థ్ మల్హోత్రా, సమంత రూత్ ప్రభు,కాజల్ అగర్వాల్, ఆర్యన్ ఖాన్, ఫరా ఖాన్ , శిబానీ దండేకర్, అన్యా సింగ్, ప్రగ్యా యాదవ్ , ఫల్గుణి పీకాక్ (ప్రముఖ డిజైనర్), నచికేత్ బార్వే (డిజైనర్) తదితరులు ఉన్నారు. ఇదే ఈవెంట్లో తమన్నా తల్లిదండ్రులు సంతోష్ భాటియా - రజనీ భాటియా కూడా ఉన్నారు. తమన్నా తన తండ్రి సంతోష్ భాటియాతో కలిసి ఈ వెంచర్ను ప్రారంభించారు.
మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా తదుపరి ఓ రోమియో, పురుషన్ లాంటి చిత్రాలలో నటిస్తోంది. ఇవన్నీ ఈ ఏడాది థియేటర్లలో సందడి చేయనున్నాయి. `ఓ రోమియో` చిత్రంలో షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. విశాల్ భరద్వాజ్ ఈ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ 13 ఫిబ్రవరి 2026న వాలెంటైన్స్ వీక్ కానుకగా విడుదల కానుంది. ఇందులో తృప్తి డిమ్రీ మరో కీలక ధారి. ఈ చిత్రంలో తమన్నా `రాబియా` అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనుంది.
యాక్షన్ హీరో విశాల్ సరసన పురుషన్ అనే చిత్రంలోను తమన్నా నటిస్తోంది. ఇది యాక్షన్-కామెడీ ఫిల్మ్. దీనికి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 2026 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో రూపొందుతున్న `వివాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్` అనే చిత్రంలోను నటిస్తోంది. ఈ చిత్రం మే 15, 2026న విడుదల కానుంది. ఇది ఒక విభిన్నమైన అడ్వెంచరస్ థ్రిల్లర్. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న క్వీన్ రీమేక్ - దట్ ఈజ్ మహాలక్ష్మి కూడా ఈ ఏడాది చివరిలో విడుదలయ్యే ఛాన్సుందని సమాచారం. భారతీయ సినీ దిగ్గజం వి. శాంతారామ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే చిత్రంలో తమన్నా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.