పరేష్ లేకుంటే 100 శాతం జరగదు: సునీల్ శెట్టి
తాజా పరిణామంతో ప్రాజెక్ట్ కి డ్యామేజ్ జరిగింది అంటూ అక్షయ్ కి చెందిన నిర్మాణ సంస్థ పరేష్ పై 25కోట్ల మేర దావా వేయడం చర్చనీయాంశమైంది;

పరేష్ రావల్ నిష్క్రమణ తర్వాత `హేరా ఫేరీ 3` టీమ్ గందరగోళంలో పడిన సంగతి తెలిసిందే. తాజా పరిణామంతో ప్రాజెక్ట్ కి డ్యామేజ్ జరిగింది అంటూ అక్షయ్ కి చెందిన నిర్మాణ సంస్థ పరేష్ పై 25కోట్ల మేర దావా వేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు ప్రియదర్శన్ ఒక కొత్త నటుడిని వెతికే పనిలో ఉన్నారని కూడా ప్రచారమైంది.
అయితే అన్నిటికీ చెక్ పెడుతూ ఈ ప్రాజెక్ట్ లో కీలక నటుల్లో ఒకరైన సునీల్ శెట్టి మాట్లాడుతూ... ఈ ప్రాజెక్ట్ నుంచి పరేష్ రావల్ తప్పుకునే అవకాశం లేదని అన్నారు. బాబూరావు పాత్ర లేకుండా ఏదీ లేదు. కథాంశం పూర్తిగా బాబూరావు పాత్రపైనే ఆధారపడి ఉంది. ఆ పాత్ర లేకపోతే సినిమా అర్థం కాదని అన్నారు. పరేష్ రావల్ లేకుండా 100 శాతం ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగదు. నేను, అక్షయ్ లేకుండా దీనికి 1 శాతం అవకాశం ఉంటుంది.. కానీ పరేష్ జీ లేకుండా 100శాతం ప్రాజెక్ట్ ముందుకు జరగదు! అని నొక్కి చెప్పారు.
పరేష్ రావల్ లేకుండా హేరా ఫేరీని ఊహించడం అసాధ్యమని సునీల్ శెట్టి అన్నారు. బాబూరావు పాత్ర ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ.. రాజు & శ్యామ్ మధ్య డైనమిక్ బాబురావు ఉంటేనే ఇది వర్కవుటవుతుంది. ఎందుకంటే వారిని అద్దెదారులుగా కలిపింది అతడే కదా! అని సునీల్ శెట్టి అన్నారు. అసలు పరేష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారనే వార్తతో ఆశ్చర్యపోయానని సునీల్ శెట్టి అన్నారు. దీనిపై అసలు తనకు ఎలాంటి అవగాహనా లేదని తెలిపారు. పరేష్ రావల్ అకస్మాత్తుగా నిష్క్రమించడం గురించి నా పిల్లలు ఆతియా, అహన్ చెబితేనే మొదట తెలిసిందని శెట్టి వెల్లడించాడు.
పిల్లలిద్దరూ 15 నిమిషాల్లోనే తనకు వార్తలను ఫార్వార్డ్ చేసి `పాపా ఇది ఏమిటి?`` అని ప్రశ్నించారని సునీల్ శెట్టి గుర్తు చేసుకున్నాడు. వెల్కమ్ టు ది జంగిల్ (వీరంతా సహనటులు) సహనటుడు ఊహించని విధంగా ప్రాజెక్ట్ నుండి వైదొలిగిన తీరుపై అపనమ్మకంగా ఉన్నానని అన్నాడు.