ఆడియన్స్ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు
ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న సితారే జమీన్ పర్ అనే సినిమా జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.;

ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న సితారే జమీన్ పర్ అనే సినిమా జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి ఈ మూవీ ఏదొక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆపరేషన్ సిందూర్ జరిగిన టైమ్ లో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి, ఇండియన్ గవర్నమెంట్ చేసిన పనిని గుర్తించకుండా అందరూ చిత్ర ట్రైలర్ గురించే మాట్లాడారని అందుకే ఈ సినిమాను బ్యాన్ చేయాలని హ్యాష్ ట్యాగులను ట్రెండ్ చేస్తున్నారు.
దాంతో పాటూ గతంలో టర్కీ వెళ్లినప్పుడు ఆమిర్ ఖాన్ అక్కడి ప్రెసిడెంట్ తో ఓ ఫోటో దిగగా ఇప్పుడు దాన్ని వైరల్ చేస్తూ ఆమిర్ సినిమాను బాయ్కాట్ చేయాలని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విషయంపై బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి రెస్పాండ్ అయి మాట్లాడారు. సెలబ్రిటీలు వాళ్లకు తెలియకుండానే కాంట్రవర్సీల్లో చిక్కుకుంటున్నారని అన్నారు.
సినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలకు సామాజిక అంశాలు, దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై రియాక్ట్ అవాలని ఎప్పుడూ ఒత్తిడి ఉంటుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. సెలబ్రిటీలుగా తామెప్పుడూ దేశ హితం కోసమే సపోర్ట్ చేస్తామని, అందుకే బాలీవుడ్ లో దేశభక్తితో కూడిన సినిమాలను కూడా తీస్తుంటామని, బాలీవుడ్ లో దేశభక్తులు చాలా మంది ఉన్నారని, కానీ అందరూ తమను తప్పుగా అర్థం చేసుకుంటారని సునీల్ శెట్టి అభిప్రాయపడ్డారు.
సితారే జమీన్పర్ బాయ్కాట్ గురించి సునీల్ శెట్టి మాట్లాడుతూ ఆడియన్స్ గతంలోని విషయాలను పట్టించుకోకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే సినిమాలు చూడాలని, గతంలో దిగిన ఫోటో ఆధారంగా ఇప్పుడు డెసిషన్స్ తీసుకోకూడదని, అయినా సెలబ్రిటీలు ఏదైనా ఈవెంట్స్ కు వెళ్లినప్పుడు ఎంతోమంది ఫోటోల కోసం వస్తారని ఆయన చెప్పారు. వివరాలన్నీ కనుక్కుని వారికి ఫోటోలు ఇచ్చేంత టైమ్ ఉండదు కదా అని ప్రశ్నించారు. తమ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరికైనా ఫోటోలు ఇవ్వకపోతే మళ్లీ మీడియానే తమను ఫోటోలు ఇవ్వనందుకు నిందిస్తుందని, ఇలాంటి విషయాల్లో సెలబ్రిటీలు తెలియకుండా చిక్కుల్లో పడుతున్నారని సునీల్ శెట్టి అన్నారు. ఇలాంటి ఒత్తిడి వల్ల సినీ ఇండస్ట్రీలో వర్క్ చేయడం కష్టమవుతుందని కూడా ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.