కోర్టు కేసులో అందాల నటికి చుక్కెదురు!
అయితే తనను ఈ కేసుల నుంచి తొలగించాల్సిందిగా జాక్విలిన్ న్యాయవాది పిటిషన్ వేయగా, కోర్టులో చుక్కెదురైంది.;
జైలులో మగ్గుతున్న ర్యాన్ బాక్సీ ప్రమోటర్లను బయటకు రప్పిస్తానని నమ్మబలికి వారి భార్యల నుంచి 200 కోట్లు కొట్టేసిన కాన్మాన్ సుకేష్ చంద్రశేఖర్ కేసు కొన్నేళ్ల క్రితం ఎంతటి సంచలనమో చూసాం. చాలా మంది సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, రాజకీయ నాయకులను సుకేష్ బురుడీ కొట్టించాడని అధికారులు తమ విచారణలో నిగ్గు తేల్చారు. 200 కోట్ల డబ్బును విదేశాలకు పంపించేందుకు అతడు కొందరితో కలిసి షెల్ కంపెనీలను ప్రారంభించాడు. చేయకూడని వ్యవస్థీకృత నేరాలన్నిటిలో అతడు భాగం.
సుకేష్ చంద్రశేఖర్ లీలలు అన్నీ ఇన్నీ కావు. ప్రముఖ బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్ తో అతడు ఎఫైర్ సాగించాడని కథనాలొచ్చాయి. జాక్విలిన్ తో అతడు సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. అయితే ఒక మోసగాడితో స్నేహం చేసినందుకు, అతడి నుంచి బహుమతులు అందుకున్నందుకు జాక్విలిన్ తీవ్ర పరిణామాల్ని ఎదుర్కొంటోంది. ఈ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ వ్యవహారంలోను జాక్విలిన్ విచారణను ఎదుర్కొంటోంది.
అయితే తనను ఈ కేసుల నుంచి తొలగించాల్సిందిగా జాక్విలిన్ న్యాయవాది పిటిషన్ వేయగా, కోర్టులో చుక్కెదురైంది. మనీలాండరింగ్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ జాక్విలిన్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండవ అనుబంధ ఛార్జిషీట్ను.. ఢిల్లీ ట్రయల్ కోర్టులో పెండింగ్లో ఉన్న విచారణలను కూడా రద్దు చేయాలని జాకీ కోరారు. అయితే ఛార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకుని విచారిస్తున్నందున ఈడీ న్యాయవాది దీనిని వ్యతిరేకించారు. కాగ్నిజెన్స్ ఆర్డర్ను సవాలు చేయలేదని న్యాయవాది తెలిపారు. జాకీ తదుపరి విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది.