షూటింగ్ చేస్తుండగా సముద్రంలో పడవ బోల్తా.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కొద్ది రోజుల క్రితం తమిళనాడు రామనాథపురం సముద్రంలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా, ఊహించని ప్రమాదం జరిగింది. చిత్రీకరణ సమయంలో సిబ్బంది ప్రయాణిస్తున్న పడవ సముద్రంలో బోల్తా పడింది.;
తెలుగులో వరుస సినిమాలతో జోష్ మీదున్న సుహాస్ కోలీవుడ్లోను అడుగుపెడుతున్నారు. మందాడి అనేది సినిమా టైటిల్. ఇది ద్విభాషా చిత్రం. తెలుగు వెర్షన్ లో సుహాస్ కథానాయకుడు కాగా, తమిళ వెర్షన్ లో హాస్య నటుడు సూరి హీరోగా నటిస్తున్నాడు. రెండు వెర్షన్ల షూటింగ్ ఒకేసారి సాగుతోందని సమాచారం. అయితే తాజా షెడ్యూల్ లో ఊహించని అపశ్రుతి చోటు చేసుకుందని కథనాలొస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం తమిళనాడు రామనాథపురం సముద్రంలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా, ఊహించని ప్రమాదం జరిగింది. చిత్రీకరణ సమయంలో సిబ్బంది ప్రయాణిస్తున్న పడవ సముద్రంలో బోల్తా పడింది. అలల తాకిడి కారణంగా జరిగిన ఈ సంఘటనలో రూ. 1 కోటి విలువైన కెమెరాలు సముద్రంలో పడి దెబ్బతిన్నాయని తెలుస్తోంది. అదృష్ఠవశాత్తూ రక్షణాత్మక వ్యవస్థ ఏర్పాటు, తక్షణ భద్రతా చర్యల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదం కారణంగా కొద్దిరోజుల పాటు షూటింగ్ ని నిలిపివేసారు. ఇటీవల మళ్లీ షూటింగ్ ప్రారంభమైందని తెలిసింది. అయితే ఈ సినిమాలో కీలక సన్నివేశాలు సముద్రంలో జరిగే పడవల పందేల చుట్టూ తిరుగుతాయి కాబట్టి కట్టుదిట్టమైన భద్రత నడుమ సముద్రంలో షూటింగ్ చేస్తున్నారని తెలిసింది.
విడుదలై 2, మామన్ వంటి చిత్రాలతో విజయాలు అందుకున్న పుగజేంది మతిమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూరి, మహిమా నంబియార్ తదితరులు నటిస్తున్నారు. మత్స్యకార గ్రామం వారి జీవన పోరాటాలపై ఆసక్తికర కథతో రూపొందుతున్న చిత్రమిది. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కూడా ఈ చిత్రంలో కొన్ని సీన్లను తెరకెక్కిస్తున్నారని తెలిసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2025 చివరిలో విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. వేట్రిమారన్ - ఎల్ రెడ్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని సమాచారం.