ట్రైలర్: పెళ్లి తరువాత సేతుపతి - నిత్యామీనన్ హోటల్ గొడవలు
ట్రైలర్ ప్రకారం.. సినిమాలో విజయ్ సేతుపతి, నిత్య మీనన్ ఇద్దరూ భార్యాభర్తలు. ఓ హోటల్ నడుపుతుంటారు.;
కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డు విన్నర్ హీరోయిన్ నిత్యా మీనన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న తాజా సినిమా తలైవన్ తలైవి. తెలుగులో ఆ సినిమాను సార్ మేడమ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 25వ తేదీన విడుదల కానున్న ఆ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఫ్యామిలీ సెంటిమెంట్ జానర్ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న పాండిరాజ్ ఈసారి కామెడీ జోనర్ తో వస్తున్నారు. టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకే రోజు ఆ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది.
యోగి బాబు, ఆర్కే సురేష్, చెంబన్ వినోద్ జోస్, శరవణన్, దీప ఇతర ముఖ్య పాత్రలు పోషించిన సార్ మేడమ్ మూవీకి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించారు. అయితే రిలీజ్ కు టైమ్ దగ్గర పడడంతో మేకర్స్..ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సార్ మేడమ్ మూవీ ట్రైలర్ వైరల్ గా మారింది.
ట్రైలర్ ప్రకారం.. సినిమాలో విజయ్ సేతుపతి, నిత్య మీనన్ ఇద్దరూ భార్యాభర్తలు. ఓ హోటల్ నడుపుతుంటారు. పెళ్లి అయిన మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తన తల్లిదండ్రులకు మంచిగా చూసుకుంటానని మాట కూడా ఇస్తాడు విజయ్. అయితే ఆ తర్వాత వివాహ జీవితంలో ప్రతిదానికి చిరాకు, గొడవలు పడుతుంటారు.
దీంతో వారి వైవాహిక జీవితంతోపాటు బిజినెస్ ప్రమాదంలో పడుతుంది. పెళ్లిచూపులతో మొదలై విడాకుల వరకు వచ్చిన సార్ మేడమ్ ల స్టోరీనే సినిమాగా తెలుస్తోంది. అయితే ట్రైలర్ లో విజయ్ సేతుపతి, నిత్యామీనన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మేజర్ హైలైట్గా నిలిచింది. వారి గొడవలు ఎంటర్టైనింగ్ గానే ఉంటాయి.
ఓవరాల్ గా ట్రైలర్.. కామెడీ, నిజాయితీ, మానవ భావోద్వేగం, జీవితంతో కూడి ఉందనే చెప్పాలి. సినిమాలోని రోల్స్ నిజ జీవితంలో మనకు దగ్గరగా ఉన్న వ్యక్తులకు పోలి ఉండటంతో వ్యక్తిగతంగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ఫన్నీగా ఉంటాయి. యోగి బాబు, చెంబన్ వినోద్ జోస్ తన కామెడీతో మెప్పించారు. మరి సార్ మేడమ్ సినిమా ఎలా ఉంటుందో.. ఎంతలా మెప్పిస్తుందో వేచి చూడాలి.