ఇరుముడి కలెక్షన్స్‌తో వారి నోళ్లు మూసుకున్నట్లేనా?

టాలీవుడ్‌ సినిమాల సక్సెస్‌ రేట్లు గత కొన్ని సంవత్సరాలుగా భారీగా తగ్గిన విషయం తెల్సిందే.

Update: 2026-08-24 09:30 GMT

టాలీవుడ్‌ సినిమాల సక్సెస్‌ రేట్లు గత కొన్ని సంవత్సరాలుగా భారీగా తగ్గిన విషయం తెల్సిందే. ముఖ్యంగా కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే వారి సంఖ్య దాదాపు సగానికి తగ్గిందని, ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడ్డారనే టాక్‌ వినిపిస్తూ వస్తోంది. నాలుగు వారాలు ఆగితే ఫ్యామిలీ మొత్తం సినిమాను ఓటీటీలో చూడవచ్చు అనే ఉద్దేశంతో థియేటర్లకు ఫ్యామిలీస్ వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు అంటూ సినీ వర్గాల వారు, సినీ విశ్లేషకులు చాలామంది మాట్లాడటం మనం చూశాం. ఫిల్మ్‌ మేకర్స్ సైతం చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు, వారు ఇంట్లోనే ఓటీటీలో సినిమాలు చూడటం అలవాటు చేసుకుంటున్నారని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వారందరికీ ఇప్పుడు ఇరుముడి సినిమా గట్టి సమాధానం చెప్పినట్లు అయింది. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్‌ సినిమాలు వస్తూ థియేటర్లు కలకలలాడుతూ ఉన్నాయి.

సంక్రాంతి సీజన్‌ సినిమాలు..

ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా థియేటర్లకు రావడం మానేశారు అనే వ్యాఖ్యలకు సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్‌ సినిమాలతో పాటు మరో రెండు మూడు సినిమాలు గట్టి సమాధానం ఇచ్చాయి. అవి స్టార్‌ హీరోల సినిమాలు, సంక్రాంతి సీజన్ కనుక ప్రేక్షకులు వచ్చారు, సాధారణ రోజుల్లో థియేటర్లకు జనాలు ఎక్కడ వస్తున్నారు అంటూ మరికొందరు మాట్లాడుతున్నారు. వారికి సమాధానం అన్నట్లుగా ఇరుముడి సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్‌ పోటెత్తుతున్నారు. సినిమా విడుదలైనప్పటి నుంచి ఇరుముడికి ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడుతున్నారు. భారీ ఎత్తున వసూళ్లు రాబడుతున్న ఇరుముడి సినిమా సరికొత్త రికార్డ్‌లను నెలకొల్పుతూ దూసుకు పోతుంది. ఆదివారం సెకండ్‌ షో పడ్డ అన్ని స్క్రీన్స్‌ ఫుల్‌ కావడం పెద్ద రికార్డ్‌గా చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్‌ సెకండ్‌ షో లకు సైతం వెళ్లేందుకు రెడీగా ఉన్నారని ఇరుముడి నిరూపితం చేసింది.

రవితేజ ఇరుముడి సినిమా కలెక్షన్స్‌..

ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు దక్కని ఓపెనింగ్స్ ఈ సినిమాకు వచ్చింది అనడంలో సందేహం లేదు. ఓటీటీలో స్ట్రీమింగ్‌ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు అనుకునే వారికి ఇరుముడి సినిమా కలెక్షన్స్‌ సమాధానం అన్నట్లుగా నిలుస్తున్నాయి. భారీ ఎత్తున వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్న ఇరుముడి సినిమాను ఎక్కువ శాతం మంది ఫ్యామిలీ ఆడియన్స్ చూడటం వల్ల ఫిల్మ్‌ మేకర్స్‌లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ కు నచ్చే విధంగా సినిమాలు తీస్తే కచ్చితంగా ఓటీటీ వరకు వెయిట్‌ చేయకుండా, థియేటర్లకు వచ్చి చూస్తారు అని తేలిపోయింది. అందుకే ఫిల్మ్‌ మేకర్స్ ఓటీటీ కోసం అని కాకుండా ప్రేక్షకులను ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ ను థియేటర్లకు రప్పించే విధంగా కథలను ఎంపిక చేసుకోవాలంటూ సినీ విశ్లేషకులు, సోషల్‌ మీడియాలో కొందరు నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

శివ నిర్వాణ దర్శకత్వంలో...

రవితేజ గత కొన్ని సంవత్సరాలుగా కెరీర్‌ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఇరుముడి సినిమాతో ఒక్కసారిగా రవితేజకు ఫుల్‌ జోష్ వచ్చినట్లు అయింది. మరో పదేళ్ల పాటు రవితేజ కెరీర్‌ కి ఢోకా లేదు అన్నట్లుగా ఇరుముడి సినిమాకు వసూళ్లు నమోదు అవుతున్నాయి. రవితేజ ను ఇలా చూపించాలి అనే ఆలోచన చేసిన దర్శకుడు శివ నిర్వాణ ను అభినందించాల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇరుముడి సినిమా రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలువబోతుంది. అంతే కాకుండా సినిమాతో రవితేజ సినిమాల ఎంపిక శైలి కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ముందు ముందు రవితేజ సినిమాల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు, సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంచి కంటెంట్‌తో వస్తే ఓటీటీ వరకు ప్రేక్షకులు వెయిట్‌ చేయరు అని, ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్‌లో చూసేందుకు వస్తారని ఇరుముడి నిరూపించింది.

Tags:    

Similar News