అల్లు 'రాకా'లో ఐదవ బ్యూటీ..!

రాకా సినిమా సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకు వెళ్తుందని, ఆ ప్రపంచంలో హీరోయిన్స్‌ ను ప్రత్యేక ఆకర్షణగా చూపించబోతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Update: 2026-08-24 06:18 GMT

అల్లు అర్జున్‌ 'పుష్ప' వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత చేస్తున్న మూవీ 'రాకా'. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్‌ మూవీ షూటింగ్ పూర్తిగా ముంబైలో జరుగుతోంది. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని దర్శకుడు అట్లీ లీక్ కాకుండా చూసుకున్నాడు. అయితే హీరోయిన్స్ విషయంలో మాత్రం బయట గందరగోళ ప్రచారాలు జరుగుతున్నాయి. అధికారిక ప్రకటన ప్రకారం 'రాకా' సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్‌. అల్లు అర్జున్‌ దీపికా పదుకునే జంటగా రాకా రూపొందుతున్నట్లుగా అట్లీ మొదట్లోనే అధికారికంగా ప్రకటన చేశాడు. ఆ తర్వాత ఈ సినిమాలో మరో ముగ్గురు నలుగురు హీరోయిన్స్‌ నటిస్తున్నారు, వారు షూట్‌లో పాల్గొంటున్నారు అంటూ రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాకా సినిమా సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకు వెళ్తుందని, ఆ ప్రపంచంలో హీరోయిన్స్‌ ను ప్రత్యేక ఆకర్షణగా చూపించబోతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

 

అల్లు అర్జున్‌కి జోడీగా దీపికా పదుకునే...

ఇప్పటి వరకు రాకా సినిమాలో దీపికా పదుకునేతో పాటు మృణాల్‌ ఠాకూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాన్వీ కపూర్‌లు కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు వచ్చాయి. వీరు హీరోయిన్స్‌ పాత్రల్లో కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా లేదంటే లేడీ విలన్‌ పాత్రల్లో కనిపించే అవకాశాలు ఉన్నానే ప్రచారం కూడా సాగింది. ఇప్పటి వరకు వీరు షూటింగ్‌లో పాల్గొన్నారు అనే విషయంలో స్పష్టత లేదు. ఇప్పటికే రాకాలో నలుగురు హీరోయిన్స్ అంటూ వార్తలు వస్తూ ఉంటే, కొత్తగా ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి సైతం కీలక పాత్రలో కనిపించబోతుందనే ప్రచారం మొదలైంది. ఐశ్వర్య లక్ష్మిని రాకా సినిమాలో కీలకమైన లేడీ విలన్‌ రోల్‌లో చూడబోతున్నామని ఫిల్మ్స్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. త్వరలో ముంబైలో రాకా సినిమా షూటింగ్‌కు ఐశ్వర్య లక్ష్మి హాజరు కాబోతుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎప్పటిలాగే ఈ విషయమై కూడా మేకర్స్‌ నుంచి క్లారిటీ లేదు.

'రాకా'లో ఐశ్వర్య లక్ష్మి ముఖ్య పాత్ర

అల్లు అర్జున్‌ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్‌ నటిస్తున్నారు అనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో అభిమానులతో పాటు, అన్ని వర్గాల వారు ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. దీపికా పదుకునే మెయిన్‌ హీరోయిన్‌ కాగా, ఇతర హీరోయిన్స్ కథలో భాగంగా వచ్చి వెళ్తూ ఉండవచ్చు. చిన్న పాత్రలే అయినా పెద్ద హీరోయిన్స్‌ ను ఆ పాత్రల్లో నటింపజేయడం వల్ల కచ్చితంగా సినిమాను ప్రేక్షకులు మరింత ఎక్కువగా ఆధరించే అవకాశాలు ఉంటాయని కొందరు విశ్లేషిస్తున్నారు. ఐదు మంది అంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇద్దరు ముగ్గురు ఉన్నా కచ్చితంగా రాకాకు కావాల్సినంత గ్లామర్‌ యాడ్‌ అవుతుంది అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి అల్లు అర్జున్ రాకా సినిమా విషయమై, హీరోయిన్స్‌ విషయమై జరుగుతున్న ప్రచారంతో సోషల్‌ మీడియా హోరెత్తుతోంది. వీటన్నింటికి అట్లీ నుంచి సమాధానం వచ్చేది ఎప్పుడో చూడాలి.

అట్లీ దర్శకత్వంలో పాన్‌ వరల్డ్‌ మూవీ రాకా...

సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో ఇప్పటి వరకు ఏ సౌత్‌ ఇండియన్‌ మూవీ కి ఖర్చు చేయనంతగా రాకా కోసం ఖర్చు చేస్తూ నిర్మిస్తున్నట్లు సమాచారం అందుతోంది. రాకాతో బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు అన్ని భాషల ప్రేక్షకులను అట్లీ అలరించడం ఖాయంగా విశ్లేషకులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సినిమాను హాలీవుడ్‌లోనూ విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అట్లీ గత చిత్రాల నేపథ్యంలో ఈ సినిమాపై అన్ని చోట్ల ఆకాశాన్ని తాకేలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునే విధంగా సినిమాను విజువల్‌ వండర్‌గా రూపొందిస్తున్నాడు. ఈ ఏడాది చివరి వరకు సినిమా పనులు పూర్తి చేసి, వచ్చే ఏడాది లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. అల్లు అర్జున్‌, అట్లీ కాంబోకి ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీని ఉపయోగించి ఈ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ చేయిస్తున్నారు. సరికొత్త టెక్నాలజీని ఈ సినిమాకు వినియోగిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.

Tags:    

Similar News