టూ పార్ట్ ట్రెండ్కు బ్రేక్.. రంగస్థలం మ్యాజిక్ మళ్లీ కనిపిస్తుందా?
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో భారీ కథలను రెండు భాగాలుగా రిలీజ్ చేయడం ఇటీవలి కాలంలో సాధారణంగా మారింది.
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో భారీ కథలను రెండు భాగాలుగా రిలీజ్ చేయడం ఇటీవలి కాలంలో సాధారణంగా మారింది. బాక్సాఫీస్ సామర్థ్యాన్ని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో పలువురు డైరెక్టర్లు ఈ ఫార్మాట్ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే ప్రతి కథను అదే పద్ధతిలో చెప్పాల్సిన అవసరం లేదనే అభిప్రాయం కూడా బలపడుతోంది. కథకు ఎంత నిడివి అవసరమో అంతవరకే పరిమితం చేయడం, అనవసరంగా విస్తరించకుండా ఒకే సినిమాలో పూర్తి అనుభూతిని అందించడం ఆడియన్స్ కు మరింత సంతృప్తిని ఇస్తుందనే డిస్కషన్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమా ఒకే భాగంగా రూపొందే అవకాశాలపై జరుగుతున్న ప్రచారం ఆసక్తిని పెంచుతోంది. చరణ్ కెరీర్లో నెక్ట్స్ మూవీ అయిన ఆర్సీ17 గా రూపొందనున్న ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ ను సుకుమార్ లాక్ చేశారని, సెప్టెంబర్ లో సినిమాను మొదలుపెట్టి, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ గురించి డిస్కషన్ మొదలైన ప్రతిసారీ ఫ్యాన్స్ కు ముందుగా గుర్తొచ్చేది రంగస్థలం. కమర్షియల్ అంశాలకు స్ట్రాంగ్ ఎమోషన్స్ ను జోడించి, పాత్రలను సహజంగా తీర్చిదిద్దిన తీరు ఆ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టింది. అదే కారణంగా ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలిసి పని చేస్తున్నారనే వార్తలతో అంచనాలు మరింత పెరిగాయి.
అయితే ఆడియన్స్ ఈసారి రంగస్థలం2 లాంటి సినిమాను కాకుండా, రంగస్థలం స్థాయి కొత్తదనాన్ని ఆశిస్తున్నారు. రామ్ చరణ్ను పూర్తిగా భిన్నమైన కోణంలో చూపించడంలో సుకుమార్కు ఉన్న ప్రత్యేక శైలి మరోసారి తెరపై ఎలా కనిపిస్తుందనే ఆసక్తి అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కథ, చరణ్ క్యారెక్టరైజేషన్, ఎమోషన్ అన్నీ బ్యాలెన్డ్స్ గా ఉంటే ఈ కాంబో మరోసారి భారీ సక్సెస్ ను నమోదు చేస్తుందనే నమ్మకం కూడా సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
మరోవైపు పుష్ప సిరీస్తో దేశవ్యాప్తంగా తన మార్క్ను మరింత బలంగా చాటుకున్న సుకుమార్ నుంచి ప్రేక్షకుల అంచనాలు ఇప్పుడు మరింత ఎత్తుకు చేరుకున్నాయి. ఆయన్నుంచి కేవలం భారీ యాక్షన్ సీన్సే కాదు, ప్రతి క్యారెక్టర్కు ప్రత్యేకమైన పాత్ర నిర్మాణం, గుర్తుండిపోయే డైలాగులు, కథలో అనూహ్య మలుపులు, బలమైన భావోద్వేగాలను కూడా అభిమానులు ఆశిస్తున్నారు. అందుకే సుకుమార్ కొత్త ప్రాజెక్ట్పై చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ జరుగుతోంది. ప్రస్తుతం రెండు పార్ట్ ల సినిమాల హవా కొనసాగుతున్న సమయంలో, కథ కోరినంత మేరకే సినిమా నిర్మించాలనే ఆలోచన నిజమైతే అది కూడా ప్రత్యేకమైన నిర్ణయంగా నిలిచే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఈ ప్రాజెక్ట్పై ఇంట్రెస్ట్ కేవలం స్టార్ హీరో- దర్శకుడి కాంబినేషన్ వల్ల మాత్రమే కాదు.. మరోసారి గుర్తుండిపోయే సినిమా వస్తుందనే ప్రేక్షకుల నమ్మకమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.