సినిమాల విషయంలో శేఖర్ అలా.. నేను ఇలా: రాజమౌళి
అయితే ఆయన.. ఇప్పుడు కుబేర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.;

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి గురించి అందరికీ తెలిసిందే. చివరగా ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆయన.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కెన్యాలో కొత్త షెడ్యూల్ ను మరికొద్ది రోజుల్లో స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఆయన.. ఇప్పుడు కుబేర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. నాగార్జున, ధనుష్, రష్మిక లీడ్ రోల్స్ లో నటించిన ఆ సినిమాను శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా, సునీల్ నారంగ్ తోపాటు పూస్కూర్ రామ్మోహన్ నిర్మించారు. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, జక్కన్న సందడి చేశారు.
వేడుకను ఉద్దేశించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. శేఖర్ కమ్ముల చూడడానికి చాలా వినయంగా ఉంటారని.. ఆయనను చూస్తే ఎవరికైనా అలా అనిపిస్తుందని రాజమౌళి చెప్పారు. కానీ శేఖర్ చాలా మొండివాడని.. నియమాల విషయంలో ఎప్పుడూ ఎక్కడా తగ్గరని చెప్పారు.
ఆయనలో ఆ లక్షణం తనకు బాగా ఇష్టమని చెప్పారు. అయితే శేఖర్ నమ్మిన సిద్ధాంతాల పైనే సినిమాలు చేస్తారని అభిప్రాయపడిన రాజమౌళి.. తాము మాత్రం సిద్ధాంతాలకు, చేసే సినిమాలకు సంబంధం ఉండదని అన్నారు. పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పారు. అందుకే మీరెంటే తనకు ఎంతో గౌరవమని శేఖర్ కు తెలిపారు.
అదే సమయంలో శేఖర్ ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అయిందంటే తాను నమ్మకలేకపోతున్నట్లు చెప్పారు. ఆయన జూనియర్ అనుకున్నా, నాకంటే ఒక సంవత్సరం సీనియర్ అని తెలిపారు. కుబేర అని టైటిల్ ప్రకటించగానే సూపర్ అనుకున్నానని, నాగార్జున- ధనుష్ ను క్యాస్టింగ్ లోకి తీసుకున్నాక అద్భుతం అనిపించిందని పేర్కొన్నారు.
ముఖ్యంగా ట్రాన్స్ ఆఫ్ కుబేర మైండ్ బ్లోయింగ్ అని కొనియాడారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పారు. సస్పెన్స్ మూవీలా అనిపిస్తుందని అంటున్నారు. నికేత్ విజువల్స్ చాలా బాగున్నాయని ప్రశంసించారు. సినిమా కోసం ఎంతో వెయిట్ చేస్తున్నామని, లుక్ ఆఫ్ ఫిల్మ్ టాప్ క్లాస్ అని ఆకాశానికెత్తేశారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన నాది నాది లోకమంతా సాంగ్.. సినిమాకే సోల్ వంటిందని పేర్కొన్నారు. మూవీని మిస్ కావొద్దని చెప్పారు.