ప్రభాస్‌కి రాజమౌళి లేఖ... ఏముందో తెలుసా?

టాలీవుడ్‌ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా యావత్‌ ఇండియన్ సినీ ప్రేక్షకులకు ప్రభాస్‌, రాజమౌళి మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిసిందే.;

Update: 2025-12-06 09:48 GMT

టాలీవుడ్‌ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా యావత్‌ ఇండియన్ సినీ ప్రేక్షకులకు ప్రభాస్‌, రాజమౌళి మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. ఇద్దరూ ఇప్పటికే పలు సూపర్‌ హిట్స్‌ ను ప్రేక్షకులకు అందించారు. ముఖ్యంగా వీరిద్దరు కలిసి బాహుబలి తీసుకు వచ్చి ఇండియన్ సినిమా స్థాయిని ఆకాశానికి ఎత్తిన విషయం తెల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్‌ సినిమా గురించి, ముఖ్యంగా తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ స్థాయిలో విజయాలను సొంతం చేసుకోవడం కేవలం వీరికి మాత్రమే సాధ్యం అంటూ ప్రతి ఒక్కరూ అనుకునే విధంగా విజయాలను సొంతం చేసుకున్నారు. వీరి బాహుబలి ఇంకా కూడా ప్రపంచంలో ఏదో ఒక మూల చర్చనీయాంశంగా ఉంది. ఇప్పుడు జపాన్‌లో బాహుబలి మరోసారి సందడికి సిద్ధం అవుతోంది. బాహుబలి రీ రిలీజ్‌కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.



 


బాహుబలి ది ఎపిక్‌ రీ రిలీజ్‌...

బాహుబలి రెండు పార్ట్‌లను కలిపి 'బాహుబలి ది ఎపిక్‌' అంటూ రాజమౌళి చాలా తెలివిగా రీ ఎడిట్‌ చేసి ఒక్క పార్ట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా వ్యాప్తంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రీ రిలీజ్‌ ల్లో ఇప్పటి వరకు ఏ సినిమాకు రాని రెవెన్యూ ఈ సినిమాకు వచ్చిందని అంటున్నారు. సాధారణంగానే రాజమౌళి సినిమా అంటే ఓ రేంజ్ అంచనాలు ఉంటాయి. అలాంటిది బాహుబలి వంటి సూపర్‌ హిట్‌ మూవీ ని మరోసారి అది కూడా రెండు పార్ట్‌లు కలిపి ఒక పార్ట్‌గా తీసుకు వస్తున్నారు అనగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక్కడ బాహుబలి ది ఎపిక్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే ఎపిక్‌ ను జపాన్‌లో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈసారి హీరో ప్రభాస్ అక్కడికి వెళ్లడం ప్రత్యేక విషయం గా అందరూ మాట్లాడుతున్నారు.

జపాన్‌లో బాహుబలి సందడి...

ఇండియన్‌ సినిమాలకు జపాన్‌లో మంచి ఆధరణ ఉంటుంది, బాహుబలి రెండు పార్ట్‌లు అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ప్రభాస్‌కి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ క్రియేట్‌ అయింది. పదేళ్లుగా ప్రభాస్‌ను అక్కడి వారు అభిమానిస్తూ ఉన్నారు. అక్కడ చాలా మంది ప్రేక్షకులు ప్రభాస్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ప్రభాస్‌ జపాన్‌ వెళ్లాడు. ఈ సందర్భంగా రాజమౌళి ఒక లేఖ ను ప్రభాస్‌కి రాశాడు. ఆ లేఖ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ లేఖలో... జపాన్‌లో నిన్ను ఎంతగా ప్రేక్షకులు అభిమానిస్తారో నీకు ఇప్పుడు అర్థం అయ్యి ఉంటుంది. వారి అభిమానం చూసి కచ్చితంగా నీకు ఆనందబాష్పాలు వస్తాయి. నేను పలు సార్లు జపాన్‌ వెళ్లాను, ప్రతి సారి కూడా ప్రభాస్ ఎప్పుడు వస్తారు అని అడిగేవారు. ఇన్నాళ్లకు వారి కోరిక తీరింది. ఇన్నాళ్ల తర్వాత నా బాహుబలి జపాన్‌లో సందడి చేయడం జరుగుతుంది. ఇంతటి అభిమానం చూపిస్తున్న జపనీస్‌ ప్రేక్షకులకు కృతజ్ఞతలు.

రాజమౌళి, ప్రభాస్‌ బాండింగ్‌

బాహుబలి ది ఎపిక్‌ ప్రమోషన్‌లో భాగంగా ప్రభాస్‌ గత రెండు రోజులుగా జపాన్‌ అభిమానులతో, ప్రేక్షకులతో ప్రభాస్ ఇంట్రాక్ట్‌ అవుతున్నాడు. ఆ సమయంలో పలు ఆసక్తికర విషయాలను ఆయన అభిమానులతో పంచుకుంటూ ఉన్నాడు. ఎన్నో బహుమానాలను సైతం ఆయన జపనీస్ అభిమానుల నుంచి తీసుకుంటున్నాడు. నిర్మాత శోభు యార్లగడ్డ సైతం ప్రభాస్‌తో ఉన్నాడు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా జపాన్‌ కి ప్రభాస్‌ గతంలో వెళ్లాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ప్రభాస్ జపాన్‌ ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలా బాధ పడుతూ తాను ఇప్పుడు రాలేక పోతున్నాను. కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో మీ వద్దకు వస్తాను అని ఆ సమయంలోనే ప్రభాస్ హామీ ఇచ్చాడు. అన్నట్లుగానే ప్రభాస్ వెళ్లి అక్కడ అభిమానులను పలకరించాడు. జపనీస్ అభిమానులు ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్‌ అభిమానంలో ప్రభాస్‌ తడిసి ముద్ద అవుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.



Tags:    

Similar News