పీవీఆర్ సినిమాస్.. ఏం జరుగుతోంది?
దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్స్ చైన్ని కలిగివున్న కార్పొరేట్ కంపనీ పీవీఆర్. ఈ థియేటర్లకు భారీ స్థాయిలో ప్రేక్షకుల ఫ్లోటింగ్ కూడా ఉంది.;
దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్స్ చైన్ని కలిగివున్న కార్పొరేట్ కంపనీ పీవీఆర్. ఈ థియేటర్లకు భారీ స్థాయిలో ప్రేక్షకుల ఫ్లోటింగ్ కూడా ఉంది. గత కొంత కాలంగా భారీ స్థాయిలో ఇండియా వైడ్గా మల్టీప్లెక్స్ థియేటర్లని ఏర్పాటు చేస్తూ ఎగ్జిబిటర్ల రంగంలో ప్రధాన వాటా దారుగా కొనసాగుతున్న పీవీఆర్పై ఇప్పుడు ఆడియన్స్ నుంచి కామెంట్ల వెల్లువ మొదలైంది. ఇప్పుడిదే ప్రధాన చర్చకు తెరలేపింది. ఎంతో కాలంగా వినియోగదారులని ఆకట్టుకుంటున్న పీవీఆర్పై ప్రేక్షకులు ఎందుకు మండిపడుతున్నారు?
అసలు వారి ఆగ్రహానికి కారణం ఏంటీ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత కొంత కాలంగా ప్రేక్షకులు పీవీఆర్పై విముఖతని వ్యక్తం చేస్తూ విమ్శలు గుప్పిస్తున్నారు. ఎగ్జిబిషన్ రంగంలో ప్రీమియం థియేటర్ ఎక్స్పీరిమన్స్ని సగటు ప్రేక్షకుడికి అందించి ప్రశంసలు అందుకున్న పీవీఆర్ ఇప్పుడు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని, ఈ విషయంలో ఫెయిల్ అవుతోందని ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ఒకప్పుడు షో టైమ్ అంటే టైమ్ అన్నట్టుగా వ్యవహరించిన పీవీఆర్ థియేటర్స్ ఇప్పుడు ఆ ప్రమాణాలు పాటించడం లేదు.
షోలని టైమ్కి ప్లే చేయకుండా టైమ్ వేస్ట్ చేస్తూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. అంతే కాకుండా థియేటర్లో సినిమా చూసే ప్రేక్షకులకు కనీస అవసరాలు కూడా కల్పించడం లేదు. ఏసీ సమస్యలు సృష్టిస్తూ వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. సిబ్బంది కూడా ప్రేక్షకుల ఫిర్యాదులపై సకాలంలో స్పందించడం లేదు. సినిమా ప్రారంభానికి ముందు ఎలాంటి ప్రకటనలు ప్లే చేయకపోయినా సినిమా ప్రదర్శనని ఆలసత్వంతో ఆలస్యం చేస్తున్నారని ప్రేక్షకులు మండిపడుతున్నారు.
ఇక సినిమా ప్రారంభమై ప్రేక్షకులు అందులో లీనం కాకుండా లైట్స్ ఆఫ్ చేయడం లేదని, దీంతో ప్రేక్షకులు సినిమాలో లీనం కావడం లేదని, దీంతో థియేటర్ వాతావరణం సహజమైన తీరుని, అలవాట్లని కోల్పోతోందని వాపోతున్నారు. సినిమా మొదలైంది లైట్స్ ఆఫ్ చేయాలి. కానీ అది మా పని కాదన్నట్టుగా సిబ్బంది వ్యవహరిస్తూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నారట. ఈ సమస్యలే ఇప్పుడు పీవీఆర్ని మసకబారేలా చేస్తున్నాయని ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా యాజమాన్యంపై దుమ్మెత్తిపోస్తున్నారు.
టికెట్ రేట్లు, పుడ్ అండ్ బేవరేజెస్పై అధిక మొత్తం డబ్బులు గుంజుతున్నా నాణ్యతా ప్రమాణాలు పాఠించడంలో పీవీఆర్ అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తోందనే విమర్శలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎంతో కాలంగా ఫిర్యాదులు చేస్తున్నా యాజమాన్యంలో ఎలాంటి కదలిక లేదని, సమస్యల పరిష్కారానికి ముందుకు రావడం లేదని పలువురు వాపోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పీవీఆర్ బ్రాండ్ వ్యాల్యూ పడిపోయే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా యాజమాన్యం నష్టనివారణ చర్యలు తీసుకుని బ్రాండ్ వ్యాల్యూని కాపాడు కోవాలని ఆడియన్స్ కోరుతున్నారు. మరి పీవీఆర్ యాజమాన్యం దిగొచ్చి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుడుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.