'పురుష' ప్రమోషన్స్: 'నిర్మాత ఆస్తి పంపకాల కథ' ఇంట్రెస్టింగ్
పవన్ కల్యాణ్, రాజ్ కశిరెడ్డి, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'పురుష'. బత్తుల కోటేశ్వరరావు ఈ చిత్రానికి నిర్మాత. వీరూ వి దర్శకుడు.
పవన్ కల్యాణ్, రాజ్ కశిరెడ్డి, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'పురుష'. బత్తుల కోటేశ్వరరావు ఈ చిత్రానికి నిర్మాత. వీరూ వి దర్శకుడు. ఈ శుక్రవారం (మే 22న) సినిమా థియేటర్లలోకి విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రచార కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంది.
తాను ఈ సినిమాని అంగీకరించడం వెనక ఉన్న అసలు కథ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని సప్తగిరి తాజా ప్రచార కార్యక్రమంలో అన్నారు. ఆ కథేమిటో వివరిస్తూ.. నిర్మాత బత్తుల తన వారసులకు ఆస్తిని పంపిణీ చేసినప్పటి తమాషా సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆస్తి పంపకాల సమయంలో ఆ కుటుంబంలో జరిగిన డ్రామా తనను ఆకర్షించిందని సప్తగిరి తెలిపారు. నిర్మాత తన కొడుకు కూతురు ఇద్దరికీ ఆస్తి పంపకాలు చేసారు. కొడుక్కి ఇచ్చిన దానికంటే 10 శాతం ఎక్కువ కూతురికి ఇచ్చారు. ఆడపిల్ల అనే సింపథీ తండ్రి చూపించినా కుమార్తె అందుకు ససేమిరా అన్నారు. తనకు ఆ అదనపు ఆస్తి అవసరం లేదని అనడమే కాకుండా, తన తమ్ముడిని హీరోని చేసేందుకు తండ్రి కల నెరవేర్చేందుకు ఆ 10 శాతం ఆస్తిని ఖర్చు చేయమని వారితో చెప్పడమే కాకుండా తన సోదరుడిని హీరోని చేసేందుకు నిర్మాతగా మారారని.. తాను ఈ మూవీకి వెంటనే ఓకే చెప్పడానికి కారణమిదేనని సప్తగిరి తెలిపారు. తన ఆత్మస్త్వ్యైర్యం, కుటుంబంలోని విలువలు నచ్చాయని అన్నారు.
పురుష చిత్రంలో తన పాత్ర వైవిధ్యంగా ఉంటుందని తెలిపారు. కరోనా మహమ్మారి తర్వాత తన కెరీర్లో ఎదురైన ఒడిదుడుకుల గురించి సప్తగిరి వివరించారు. లాక్డౌన్ తర్వాత తాను హీరోగా చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడలేదనే విషయాన్ని నిజాయితీగా అంగీకరించారు. ఆ పరాజయాల తర్వాత తాను కెరీర్ పరంగా ఒక అడుగు వెనక్కి వేసి.. నెమ్మదిగా కమెడియన్గా మళ్లీ బిజీ అవుతూనే.. మరోవైపు బలమైన కథ- కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే ఓకే చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
కేవలం రొటీన్ కామెడీ పాత్రలకే పరిమితం కాకుండా..నటుడిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలనే తపనతోనే `పురుష` వంటి వైవిధ్యమైన స్క్రిప్ట్ను ఎంచుకున్నట్లు సప్తగిరి పేర్కొన్నారు. ఒక కమెడియన్గా ప్రేక్షకులను నవ్వించడంతో పాటు.. కథలో వైవిధ్యం ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. బుల్ ఫైట్ ఎపిసోడ్స్, కబడ్డీ ఎలిమెంట్స్ వంటి విభిన్నమైన కమర్షియల్ హంగులతో పాటు, గుండెలను పిండేసే ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాలో హైలైట్గా నిలుస్తాయని ఆయన వివరించారు.
ఇండస్ట్రీలో మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా టాలీవుడ్ యాక్టర్లు తమ శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా సప్తగిరి అభిప్రాయపడ్డారు. `పురుష` సినిమా ద్వారా ప్రేక్షకులకు ఒక సరికొత్త సప్తగిరి కనిపిస్తాడని...కథను నమ్మి నిర్మాత పెట్టిన పెట్టుబడికి.. తాను పడిన శ్రమకు థియేటర్లలో సరైన న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కమెడియన్గా నవ్విస్తూనే... ఒక విభిన్నమైన నటుడిగా ఇండస్ట్రీలో తన మార్కును స్థిరపరుచుకోవడమే తన మునుపటి లక్ష్యమని తెలిపారు. మొత్తానికి పురుష నిర్మాత కుమార్తె కు ఇచ్చిన 10శాతం ఎక్స్ ట్రా ఆస్తి చివరికి తనయుడు (పవన్ కల్యాణ్) ని హీరోని చేసిందన్నమాట.