బుచ్చి మాస్టర్ ప్లాన్.. సరైనోళ్లనే తీసుకొచ్చినట్లున్నారే..
మరో 20 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న పెద్ది సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.
మరో 20 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న పెద్ది సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఆ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రంగస్థలం తర్వాత చరణ్ మరోసారి విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీలో కనిపిస్తుండటంతో అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది.
ఇప్పుడు ఓవైపు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు భారీ ప్రమోషన్స్ కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది. ముఖ్యంగా టెక్నికల్ టీమ్ చూసినా, క్యాస్టింగ్ చూసినా దర్శకుడు బుచ్చిబాబు ఆ ప్రాజెక్ట్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. సినిమాకు ఆస్కార్ విజేత రెహమాన్ సంగీతం అందిస్తుండగా, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సినిమాటోగ్రాఫర్ రత్నవేలు విజువల్స్, అవినాష్ కొల్లా ఆర్ట్ వర్క్ సినిమాకు మరో హైలైట్ గా నిలవనున్నాయని టాక్ వినిపిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఆ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతున్న అంశం మాత్రం గౌర్నాయుడు పాత్ర గురించే.
కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్ ఆ పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ విడుదల చేసిన పవర్ ఫుల్ గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. కుస్తీ బరిలో శివరాజ్ కనిపించిన తీరు, ఆయన చూపించిన ఇంటెన్స్ లుక్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. ఆ వీడియో చూసిన తర్వాత బుచ్చిబాబు క్యాస్టింగ్ విషయంలో ఎంత క్లారిటీతో ముందుకెళ్లారో అభిమానులకు అర్థమైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా గౌర్నాయుడు పాత్ర కథలో కీలకంగా ఉండబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రామ్ చరణ్- శివరాజ్ కుమార్ కాంబినేషన్ సీన్లు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఫ్యాన్స్ ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆ పాత్ర కోసం మొదట శివరాజ్ ను అనుకోలేదట. కన్నడ స్టార్ ఉపేంద్ర, తమిళ స్టార్ విక్రమ్ పేర్లు ముందుగా పరిశీలించినట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
అయితే వాళ్లు అప్పటికే ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో చివరికి శివన్నను సంప్రదించారట. కథ, పాత్ర వినగానే ఆయన వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు గ్లింప్స్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. మేకర్స్ సరైన నటుడినే తీసుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
విలేజ్ బ్యాక్ డ్రాప్, స్పోర్ట్స్ ఎమోషన్స్, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఆ చిత్రం ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో దృష్టిని ఆకర్షించింది. ఏదేమైనా చరణ్ మాస్ ఇమేజ్ కు తగ్గట్టే బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్ తో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా శివరాజ్ కుమార్ లాంటి పవర్ ఫుల్ నటులను తీసుకురావడం పెద్ద ప్లస్ అవుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. నెక్స్ట్ వచ్చే ట్రైలర్ కూడా క్లిక్ అయితే.. పెద్ది బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అవ్వడం ఖాయమనే అంచనాలు ఇప్పటికే అందరిలో మొదలయ్యాయి.