పిక్టాక్ : చాలా రోజుల తర్వాత పవన్ ఇలా
చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఒక ప్రైవేట్ ఈవెంట్లో చాలా ఫార్మల్ లుక్లో కనిపించి సర్ ప్రైజ్ చేశాడు.;
పవన్ కళ్యాణ్ గత రెండు సంవత్సరాలుగా పూరి రాజకీయ నాయకుడిగా మారాడు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. కూటమి కట్టడం కోసం దాదాపు ఏడాది పాటు తీవ్రంగా ప్రయత్నాలు చేసిన పవన్ కళ్యాణ్ అనుకున్నట్లుగా అధికారంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ వంద శాతం సక్సెస్ రేటుతో అద్భుతవిజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఏడాది పాటు పరిపాలన, రాజకీయాల గురించి సీరియస్గా ఉన్నారు. ఎట్టకేలకు ఆయన మధ్యలో ఉన్న సినిమాలను ముగించేందుకు ముందుకు వచ్చారు.
గత నెల రోజులుగా వరుస షూటింగ్స్తో పవన్ బిజీగా ఉంటున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఒక్క రోజు క్రితం 'ఓజీ' సినిమాలోని తన పోర్షన్ను పూర్తి చేశాడు. రెండు సినిమాలు పూర్తి కావడంతో ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రెడీ అవుతూ ఉంటాడని తెలుస్తోంది. ఈ నెలలో ఆ సినిమా షూటింగ్ కూడా ఉంటుంది అంటూ వార్తలు వచ్చాయి. ఆ విషయమై మరోసారి క్లారిటీ రావాల్సి ఉంది. షూటింగ్స్ కోసం పవన్ కళ్యాణ్ నార్మల్ ఔట్ ఫిట్లో కనిపిస్తున్నాడు. కానీ ఏదైనా పబ్లిక్ కార్యక్రమాలకు, ప్రైవేట్ ఈవెంట్స్కి వెళ్లినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ఎక్కువగా రాజకీయ నాయకుడిగా మాత్రమే కనిపిస్తూ వచ్చారు.
చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఒక ప్రైవేట్ ఈవెంట్లో చాలా ఫార్మల్ లుక్లో కనిపించి సర్ ప్రైజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ టీ షర్ట్ ధరించి, సింపుల్ హెయిర్ స్టైల్తో లైట్ గడ్డంతో కనిపించాడు. కాస్త పెరిగిన జట్టుతో హరీష్ శంకర్ సినిమాలో పవన్ కనిపించాల్సి ఉందేమో. అందుకే గత కొన్ని రోజులుగా ఆయన జుట్టు పెద్దగా కనిపిస్తోందని కొందరు కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ విజయవాడలోని ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ ఈ లుక్ లో భలే ఉన్నాడు అంటూ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన లుక్ విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఇక పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా విషయానికి వస్తే ఈ నెలలో విడుదల కావాల్సి ఉండగా వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. ఇదే నెల చివరి వరకు విడుదల చేయడం కోసం మేకర్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఎంత వరకు సాధ్యం అవుతుంది అనేది చూడాలి. ఈ నెలలో సాధ్యం కాకుంటే వచ్చే నెలలో వీరమల్లు రాక కన్ఫర్మ్. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభం అయిన వీరమల్లు సినిమా కొన్ని కారణాల వల్ల నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ పూర్తి చేయాల్సి వచ్చింది. మరో వైపు సాహో సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు వచ్చింది. పవన్ పోర్షన్ పూర్తి చేశాడు. ఈ నెల చివరి వరకు షూటింగ్ పూర్తి చేసి అనుకున్న తేదీకి కచ్చితంగా ఓజీని విడుదల చేయాలని సుజీత్ ప్లాన్ చేస్తున్నాడు.