ఇకపై 'ఓజీ' ప్రేక్షకులకు రాధిక వినోదం..!

ఈ నేపథ్యంలో సినిమాను మరింత ఇంట్రస్ట్‌గా మార్చేందుకు గాను మేకర్స్ సినిమాలో ఐటెం సాంగ్‌ యాడ్‌ చేశారు.;

Update: 2025-10-01 06:23 GMT

పవన్‌ కళ్యాణ్‌, సుజీత్‌ కాంబోలో రూపొందిన 'ఓజీ' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యాన్స్‌కి ఫుల్‌ కిక్‌ ఇచ్చిన ఓజీ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దాదాపుగా రూ.300 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. సినిమా మొదటి వారం పూర్తి చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో సినిమాను మరింత ఇంట్రస్ట్‌గా మార్చేందుకు గాను మేకర్స్ సినిమాలో ఐటెం సాంగ్‌ యాడ్‌ చేశారు. ఇప్పటికే ఓజీ సినిమాలో నేహాశెట్టి నటించిన ఐటెం సాంగ్‌ను జత చేశారు. ఈ పాటను సినిమా కోసం చాలా ప్రత్యేకంగా షూట్‌ చేశారు, తమన్‌ ఎప్పటిలాగే ఈ పాట కోసం కాస్త ఎక్కువగానే ఎఫర్ట్‌ పెట్టి ట్యూన్‌ చేయడం, దర్శకుడు సుజీత్‌ ఈ పాటను బాగా రిచ్‌గా, స్టైలిష్‌ గా షూట్‌ చేయడం జరిగిందట. కానీ ఫైనల్‌ ఎడిట్‌ సమయంలో ఈ సినిమాలో ఆ పాటను తొలగించారు. దాంతో నేహా శెట్టి ఫ్యాన్స్ ఈ పాటను లేపేయడంతో ఒకింత అసహనం వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే.

ఓజీ సినిమాను మళ్లీ చూసే విధంగా..

ఓజీ విడుదలై మంచి స్పందన దక్కించుకోవడంతో పాటు, రాబోయే వారం దసరా సీజన్‌ కావడంతో మరింత భారీ వసూళ్లు వస్తాయనే నమ్మకంతో ప్రత్యేక ఆకర్షణగా ఉండాలనే ఉద్దేశంతో, పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగా ఈ పాటను యాడ్‌ చేయడం జరిగింది. డీజే టిల్లు సినిమా తర్వాత రాధిక అంటూ నేహా శెట్టి ఏ స్థాయిలో పాపులర్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌ మీడియాలో ఆమె అందమైన ఫోటోలు రెగ్యులర్‌గా వైరల్‌ కావడం మనం చూస్తూనే ఉంటాం. అలాంటి నేహా శెట్టి ఐటెం సాంగ్‌ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి ఉంటుంది. ఓజీ సినిమాను ఇప్పటికే చూసిన వారు సైతం ఖచ్చితంగా మళ్లీ సినిమా థియేటర్‌ వైపు అడుగులు వేయడం ఖాయం అంటూ మేకర్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నేహా శెట్టిని వెండి తెరపై ఓజీతో కలిసి చూస్తే ఆ కిక్‌ వేరే లెవల్‌ అంటూ రాధిక లవర్స్‌ తెగ ఆరాటపడుతున్నారు.

నేహా శెట్టి కిస్‌కిస్‌ తో ఓజీ రీలోడ్‌

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కి మతి పోగొట్టిన ఓజీ సినిమాను నేహా శెట్టి చేసిన ఈ కిస్‌కిస్‌ బ్యాంగ్‌ బ్యాంగ్‌ పాటతో రీ లోడ్‌ చేస్తున్నారు. మేకర్స్‌ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఈ విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓజీ సినిమాకు మళ్లీ బుకింగ్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దసరా పండుగ సందర్భంగా అంతే కాకుండా సెకండ్‌ వీకెండ్‌లోనూ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి అందంతో పాటు నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు ఓజీ సినిమాలో తన పాటతో నేహా ఆకట్టుకుంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వెండి తెరపై ఓజీతో కలిపి రాధికను చూసిన వారు సోషల్ మీడియాలో పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.

తమన్‌ సంగీతంకు పాజిటివ్‌ మార్కులు

సాహో సుజీత్‌ సినిమా అనగానే మొదటి నుంచి అభిమానులు అంచనాలు పెంచుకున్నారు. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రతి సీన్‌ ను ఒక ఇంట్రడక్షన్‌ సీన్‌ మాదిరిగా, పవన్‌ ఫ్యాన్స్‌ కుర్చీ అంచున కూర్చుని ఎంజాయ్‌ చేసే విధంగా సినిమాను రూపొందించాడు. రెగ్యులర్‌ ప్రేక్షకులు కాస్త అటు ఇటూ అన్నా కూడా ఫ్యాన్స్‌ మాత్రం ఆహా ఓహో అంటూ తెగ ఊగి పోతున్నారు. ఫ్యాన్స్‌ మళ్లీ మళ్లీ సినిమాను చూస్తూనే ఉన్నారని తెలుస్తోంది. తమన్ అందించిన సంగీతం కారణంగా సినిమా స్థాయి అమాంతం పెరిగింది అనడంలో సందేహం లేదు. రివ్యూవర్స్ ప్రధానంగా తమన్‌ సంగీతానికి పాజిటివ్‌ మార్కులు వేశారు. కనుక ఇప్పుడు ఈ కిస్‌కిస్ బ్యాంగ్‌ బ్యాంగ్‌ పాట మరింతగా ఆకట్టుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాధిక కనుక ఈ పాటతో ఆకట్టుకుంటే ముందు ముందు హీరోయిన్‌గా స్టార్‌ హీరోల సినిమాల్లో బుక్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Tags:    

Similar News