'ది ప్యార‌డైజ్‌'..ఆ ట్రాప్‌లో చిక్క‌ని నేచుర‌ల్ స్టార్‌!

టాలీవుడ్ టు బాలీవుడ్ వ‌ర‌కు ఎక్క‌డ విన్నా పాన్ ఇండియా సినిమాల ముచ్చ‌ట్లే వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాలే క‌నిపిస్తున్నాయి.;

Update: 2026-02-13 06:25 GMT

టాలీవుడ్ టు బాలీవుడ్ వ‌ర‌కు ఎక్క‌డ విన్నా పాన్ ఇండియా సినిమాల ముచ్చ‌ట్లే వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాలే క‌నిపిస్తున్నాయి. మునుపెన్న‌డూ లేనంత‌గా భారీ సినిమాల నిర్మాణం పెర‌గ‌డంతో ప్ర‌తి స్టార్ హీరో పాన్ ఇండియా అంటున్నాడు. అంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ గ‌త కొంత కాలంగా బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బస్ట‌ర్ హిట్ అనిపించుకున్న ప్ర‌తి సినిమాకు ఇప్పుడు సీక్వెల్స్ అంటూ పార్ట్‌లు పార్ట్‌లు తెర‌పైకి తీసుకురావ‌డం ట్రెండ్‌గా మారింది. చాలా వ‌ర‌కు ఈ మ‌ధ్య సీక్వెల్స్ గోల మ‌రీ ఎక్కువైపోతోంది. ప్ర‌తి బ్లాక్ బ‌స్ట‌ర్‌కు సీక్వెల్‌ని తెర‌పైకి తీసుకొస్తుండ‌టంతో ఎక్క‌డ విన్నా ఇవే పేర్లు వినిపిస్తున్నాయి.

అంతే కాకుండా ఏ క్రేజీ హీరో భారీ సినిమా మొద‌లు పెట్టినా దానికి కొన‌సాగింపుగా సీక్వెల్ ఉంటుంద‌నే ప్ర‌చారం జోరందుకుంటోంది. సీక్వెల్స్ విష‌యంలో కొంత మంది మాత్ర‌మే విజయం సాధించ‌డం, మిగ‌తా వారు బాక్సాఫీస్ వ‌ద్ద త‌డ‌బ‌డ‌టంతో ఈ ట్రెండ్‌ని ఎక్కువ మంది ఫాలో కావ‌డానికి కొంత జంకుతున్నారు. తెలుగులో `బాహుబ‌లి`తో జ‌క్క‌న్న ఈ ట్రెండ్‌కు శ్రీ‌కారం చుట్ట‌డం తెలిసిందే. ఆ త‌రువాత అదే స్థాయిలో దీన్ని కొన‌సాగించిన డైరెక్ట‌ర్స్ ప్ర‌శాంత్ నీల్‌, సుకుమార్‌. ప్ర‌శాంత్ నీల్ `కేజీఎఫ్‌`, కేజీఎఫ్ 2`ల‌ని తెర‌కెక్కించి బ్యాక్‌టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

అదే పంథాలో సుకుమార్ `పుష్ప‌`, `పుష్ప‌2` చేయ‌డం అవి పాన్ ఇండియా వైడ్‌గా భారీ బ్లాక్ బ‌స్ట‌ర్లు కావ‌డం చూశాం. దీంతో ప్ర‌స్తుతం అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్‌లో ఉన్న కొన్ని క్రేజీ మూవీస్ కూడా పార్ట్ 1, పార్ట్ 2లుగా రాబోతున్నాయ‌ని, అందులో నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న రా, అండ్ ర‌స్టిక్ యాక్ష‌న్ డ్రామా `ది ప్యార‌డైజ్‌` కూడా రెండు భాగాలుగా రానుంద‌ని ప్ర‌చారం మొద‌లైంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఆ ట్రెండ్‌ని నాని ఫాలో కావ‌డం లేద‌ని, ఈ క్రేజీ ట్రెండ్‌కు గ‌ట్టి బ్రేక్ వేశార‌ని తెలిసింది. హైప్ కోసం లేదా అద‌న‌పు లాభాల కోసం మూడు గంట‌ల నిడివితో ఇంటెన్స్ గ్రిప్పింగ్ డ్రామాగా సాగే సినిమాను రెండు భాగాలుగా విడ‌గొట్టే ట్రెండ్‌కు నాని బ్రేక్ వేశాడు.

హీరో నేచుర‌ల్ స్టార్ నాని తాజా నిర్ణ‌యంతో ఆడియ‌న్స్, ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుని మంచి నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని ప్ర‌శంసిస్తున్నార‌ట‌. కొంత మందికి మాత్ర‌మే స‌క్సెస్‌ల‌ని అందించి సాధ్య‌మైన సీక్వెల్స్ సంస్కృతి మ‌రెంద‌రిలో భారంగా మారింది. ఈ ట్రాప్‌లో ప‌డ‌కుండా నాని సేఫ్‌గా ఎస్కేప్ అయ్యాడ‌ని, స‌రైన నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని ఇండస్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే 80వ ద‌శ‌కంలో సికింద్రాబాద్ ఏరియాలోని ఓ వ‌ర్గం సామాజిక వివ‌క్ష‌కు గురై త‌మ హ‌క్కుల కోసం చేసిన పోరాటం నేప‌థ్యంలో దీన్ని తెర‌కెక్కిస్తున్నాడు శ్రీ‌కాంత్ ఓదెల‌.

`ద‌సరా` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత మ‌రోసారి నాని, శ్రీ‌కాంత్ ఓదెల‌, సుధాక‌ర్ చెరుకూరి క‌లిసి చేస్తున్న సినిమా కావ‌డంతో దీనిపై స‌హ‌జంగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇది క‌డుపుమండిన కాకుల క‌థ అంటూ రిలీజ్ చేసిన ఫ‌స్ట్ వీడియో సినిమా ఎంత ర‌ష్టిగా, రాగా ఉంటుందో స్ప‌ష్టం చేసింది. నాని రెండు జ‌డ‌లు వేసుకుని విచిత్ర‌మైన గెట‌ప్‌లో న‌టిస్తున్న ఈ మూవీని ముందు మార్చి 26న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆగ‌స్టు 21కి పోస్ట్ పోన్ చేయ‌డం జ‌రిగింది.

Tags:    

Similar News