నైజాంలో MSG ర్యాంపేజ్.. 30 లక్షల మంది చూసేశారా?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు (MSG) బాక్సాఫీస్ వద్ద నాన్ స్టాప్ గా దూసుకుపోతోంది.;
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు (MSG) బాక్సాఫీస్ వద్ద నాన్ స్టాప్ గా దూసుకుపోతోంది. విడుదలై రెండు వారాలు పూర్తయినా వసూళ్లలో ఏమాత్రం తగ్గుదల కనిపించకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో ఆ సినిమా సృష్టిస్తున్న హవా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
మేకర్స్ ప్రకారం, నైజాం ఏరియాలో ఇప్పటివరకు 30 లక్షల మందికి పైగా ప్రేక్షకులు థియేటర్లలో సినిమాను వీక్షించారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటిస్తూ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. "మెగాస్టార్ ర్యాంపేజ్ కొనసాగుతోంది… నైజాంలోనే 30 లక్షల మంది ప్రేక్షకులు MSGని సెలబ్రేట్ చేశారు" అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆనందం మరింత పెరిగింది.
వర్కింగ్ డేస్ లో కూడా కుటుంబ ప్రేక్షకులు, మాస్ ఆడియన్స్ భారీగా థియేటర్లకు తరలివస్తుండటం విశేషం. వీక్ డేస్ లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించడం సినిమా స్ట్రాంగ్ రన్ కు నిదర్శనంగా మారింది. విడుదలైన ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం మూవీకి పెద్ద ప్లస్ అయింది! ఇక 18వ రోజుకీ కలెక్షన్లు స్టడీగా కొనసాగుతుండటంతో ట్రేడ్ పండితులు సినిమాను బ్లాక్ బస్టర్ గా ఫిక్స్ చేస్తున్నారు.
దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్క్ మాస్ ఎంటర్టైన్మెంట్ కు ఫ్యామిలీ ఎమోషన్స్ యాడ్ చేసి సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గర చేశారని చెప్పాలి. చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగ్, పవర్ ఫుల్ డైలాగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్ లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
హీరోయిన్ గా నయనతార నటించగా, గెస్ట్ అప్పియరెన్స్ లో వెంకటేష్ కనిపించడం సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. కలెక్షన్ల విషయానికి వస్తే, రిలీజ్ రోజు నుంచే సినిమా రికార్డుల వేట మొదలుపెట్టింది. ప్రీమియర్స్ ద్వారానే రూ.9.35 కోట్ల నెట్ వసూలు చేయడం విశేషం.
సంక్రాంతి సెలవుల ప్రభావంతో తొలి వీకెండ్ లో థియేటర్లు కిటకిటలాడాయి. దీంతో మొదటి వారంలోనే సినిమా లాభాల బాట పట్టింది. అంతేకాదు, మెగాస్టార్ కెరీర్ లో రూ.200 కోట్ల నెట్ కలెక్షన్ మార్క్ ను దాటిన తొలి చిత్రంగా నిలిచింది. దీంతో చిరంజీవి కెరీర్ లో మరో మైలురాయిని నమోదు చేసింది. ప్రాంతాల వారీగా కూడా సినిమా రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తూ ముందుకు సాగుతోంది.
ఇలా చూస్తే మన శంకర వర ప్రసాద్ గారు కేవలం హిట్ మాత్రమే కాకుండా, 2026 సంవత్సరంలో టాలీవుడ్ బాక్సాఫీస్ ను శాసించే చిత్రాల్లో ఒకటిగా నిలవనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరికొన్ని రోజులపాటు సినిమా సాలిడ్ కలెక్షన్స్ సాధించేలా కనిపిస్తోంది. ఏదేమైనా మెగాస్టార్ స్టామినా ఏమిటో మరోసారి మన శంకర వరప్రసాద్ గారు నిరూపించిందని ఫ్యాన్స్ చెబుతున్నారు.