కూలీ మూవీ రిజల్ట్.. కనగరాజ్ అలా అన్నారేంటి?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో కూలీ మూవీ రూపొందిన విషయం తెలిసిందే.;
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో కూలీ మూవీ రూపొందిన విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఆ సినిమా ఆగస్టు 14వ తేదీన రిలీజైంది. రీసెంట్ గా రూ.500 కోట్ల క్లబ్ లోకి కూడా చేరింది. మరికొద్ది రోజుల్లో ఓటీటీలోకి రానుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
విడుదలకు ముందు కూలీ మూవీపై ఆడియన్స్ తో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా వారి అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. స్టోరీలో ఏదో సమ్ థింగ్ మిస్ అయిందని, సీన్స్ లో లాజిక్ లేదని, స్క్రీన్ ప్లే బోరింగ్ గా అనిపించిందని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అనుకున్న రేంజ్ లో మూవీ లేదని అన్నారు.
అయితే కూలీ మూవీ తర్వాత రిజల్ట్ పై స్పందించని లోకేష్.. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సినిమాపై ఎక్కువ అంచనాలు పెట్టుకోవడమే తప్పన్నట్లు స్పందించారు. ట్రైలర్ చూసి కొందరు టైమ్ ట్రావెల్ స్టోరీ అనుకున్నారని తెలిపారు. మరికొందరు తన యూనివర్స్ లో పార్ట్ అని కూడా అన్నట్లు చెప్పారు.
కానీ అవే నిజం కాదని తాను విడుదలకు ముందే క్లారిటీగా చెప్పినట్లు గుర్తు చేశారు. అయినా అవేం పట్టించుకోకుండా ఆడియన్స్ ఏవోవో అంచనాలు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. వాటితోనే థియేటర్స్ కు వచ్చారని తెలిపారు. తప్పుడు అంచనాలతో సినిమాను చూసినప్పుడు తప్పకుండా నిరాశ చెందుతారని తెలిపారు.
ఆ విషయంలో తానేం చేయలేనని వ్యాఖ్యానించారు. అయితే ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు తాను కథ రాయలేనని తెలిపారు. కూలీ సినిమాతో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయానని అంగీకరించారు. కానీ నెక్స్ట్ టైమ్ మరింత గట్టిగా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. ఇప్పుడు లోకేష్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అదే సమయంలో తన అప్ కమింగ్ ప్రాజెక్టు కోసం కూడా మాట్లాడారు లోకేష్. అయితే కూలీ తర్వాత ఖైదీ సీక్వెల్ చేస్తానని ఆయన కొన్ని రోజుల క్రితం తెలిపారు. కానీ ఇప్పుడు రజినీకాంత్, కమల్ హాసన్ తో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ తీస్తారని ప్రచారం జరుగుతోంది. ఈసారి ప్రేక్షకులు ఏ అంచనాలు పెట్టుకోని సినిమా తీస్తానని ఆయన చెప్పడం గమనార్హం. మరి ఏ మూవీ చేస్తారో ఆయనకే తెలియాలి.