చనిపోతాననుకున్నా.. ఒత్తిడిపై గాయని!
కోల్డ్ప్లే భారతదేశంలో తమ `మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్` ప్రపంచ పర్యటనను నిర్వహించిన సంగతి తెలిసిందే.;
కోల్డ్ప్లే భారతదేశంలో తమ `మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్` ప్రపంచ పర్యటనను నిర్వహించిన సంగతి తెలిసిందే. భారతదేశంలో అతడికి ఇది మొదటి కచేరీ. కచేరీ ప్రారంభోత్సవం చేసిన మొదటి భారతీయ కళాకారిణిగా గాయని జస్లీన్ చరిత్ర సృష్టించింది. అయితే కచేరీ సమయంలో యువగాయని ప్రదర్శన చాలా మందిని అసంతృప్తికి గురిచేయడంతో తీవ్రమైన ట్రోలింగ్ ని ఎదుర్కొంది. సోషల్ మీడియాలో నెటిజనులు చెలరేగి విమర్శించారు.
ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ జస్లీన్ తన యూట్యూబ్ ఛానెల్లోని రిలీజ్ చేసిన మినీ డాక్యుమెంటరీలో తన ఆలోచనలను షేర్ చేసారు. డివై పాటిల్ స్టేడియంలో కచేరీ లో ప్రదర్శనకు సిద్ధమవుతున్నప్పుడు.. తనపై చాలా ఒత్తిడి ఉందని ఆమె పేర్కొంది. అసలు గాయని తన బృందంలో ఎలాంటి తప్పు జరిగిందో ఈ వీడియోలో చర్చించింది. టెక్నికల్ టీమ్ ని నిందించే కంటే ముందు, తాను ఫేస్ చేసిన సమస్యల గురించి ప్రస్థావించింది. ఒక నిర్దిష్ట సమయం తర్వాత ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైందని భావించాను. నాపై చాలా ఒత్తిడి ఉంది. నేను చనిపోతానని అనుకున్నాను. అయినా ఇంకా పాడుతూనే ఉన్నాను.. షోలో చేయాల్సినది చాలా మిగిలి ఉంది.. అని తెలిపింది. తన చెవులకు సమస్య ఏర్పడిందని తెలిపింది.
గాయనికి రెండవ రోజు పరిస్థితి మెరుగైంది. ఉత్తమ ప్రదర్శన ఇవ్వగలిగింది. ప్రేక్షకులు మద్దతు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపింది. ఆసక్తికరంగా తాను స్వయం శిక్షణ పొందిన సంగీత విద్వాంసురాలినని, నేను పరిపూర్ణురాలిని కాదు అని కూడా జస్లీన్ వెల్లడించింది. నేను ప్రతిరోజూ నేర్చుకుంటూనే ఉంటాను. నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ప్రజలకు ఏదోఒక రోజు గొప్ప అనుభవాన్ని పొందేలా ప్రదర్శనను ఇవ్వాలనుకుంటున్నాను.. అని తెలిపింది. షేర్ షా, గల్లీబోయ్, బద్లాపూర్ లాంటి చిత్రాల్లో జస్లీన్ పాడారు.