ఎట్టకేలకు ధనుష్ తో దిల్‌ 'శ్రీకారం'

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ప్రస్తుతం తమిళ స్టార్‌ హీరోల వైపు, తమిళ స్టార్‌ దర్శకుల వైపు చూస్తున్నాడు.

Update: 2024-05-04 15:30 GMT

టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్‌ హీరోలతో సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ప్రస్తుతం తమిళ స్టార్‌ హీరోల వైపు, తమిళ స్టార్‌ దర్శకుల వైపు చూస్తున్నాడు. ఇప్పటికే తమిళంలో సూపర్‌ స్టార్‌ విజయ్‌ తో ఒక సినిమాను చేసిన దిల్‌ రాజు ప్రస్తుతం తమిళ స్టార్‌ దర్శకుడు శంకర్ తో సినిమాను చేస్తున్నాడు.

దిల్ రాజు ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు, కొత్త హీరోల సినిమాలను కూడా చేస్తున్నాడు. ఇదే సమయంలో తమిళ స్టార్‌ హీరో ధనుష్ తో ఒక సినిమాకు దిల్‌ రాజు సైన్ చేయించాడని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

కొన్ని రోజుల క్రితం మేము.. శ్రీకారం చిత్ర దర్శకుడు కిషోర్‌ బి తో ధనుష్ కు దిల్‌ రాజు కథ చెప్పించాడు అని చెప్పాం. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్‌ ఒకటి వచ్చింది. ఇటీవలే ధనుష్ కొన్ని మార్పులు చేర్పులు చెప్పి వాటిని మార్చిన తర్వాత కథకు ఓకే చెప్పాడట.

కిషోర్‌ బి దర్శకత్వంలో ధనుష్ సినిమా దిల్ రాజు బ్యానర్‌ లో దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరా అనే సినిమాను ధనుష్ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత కిషోర్ దర్శకత్వంలో సినిమాకు దిల్ రాజుకు ధనుష్ డేట్లు ఇవ్వబోతున్నాడు.

Read more!

దిల్‌ రాజు బ్యానర్‌ లో రూపొందుతున్న పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ల్లో ధనుష్ సినిమా కూడా చేరబోతుంది. ఇటీవలే విజయ్ దేవరకొండతో మరో సినిమాను ప్రకటించిన దిల్‌ రాజు అతి త్వరలోనే ధనుష్ హీరోగా కూడా సినిమాను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

ధనుష్ తో సినిమాను నిర్మించేందుకు చాలా ఏళ్లుగా దిల్‌ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మధ్య దిల్‌ రాజుకు ధనుష్ డేట్లు కూడా ఇచ్చాడు. కానీ స్క్రిప్ట్‌ విషయంలో తేడా కొట్టి అప్పుడు సినిమా ప్రారంభం అవ్వలేదు. ఇప్పుడు మళ్లీ కిషోర్‌ బి తో కథ చెప్పించగా ధనుష్ ఓకే చెప్పడం జరిగిందట.

శ్రీకారం సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు కిషోర్‌ ఈసారి ధనుష్ తో చేయబోతున్న సినిమాతో కమర్షియల్‌ హిట్‌ ను దక్కించుకుంటాడా అనేది చూడాలి. త్వరలో ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2025 లో ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News