పండు మాస్టర్ హెల్త్‌పై టెన్షన్.. తాజా అప్డేట్ ఇచ్చిన నందు!

బుల్లితెర పాపులర్ డాన్స్ షో ‘ఢీ’ ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న పండు మాస్టర్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

Update: 2026-06-04 05:56 GMT

బుల్లితెర పాపులర్ డాన్స్ షో ‘ఢీ’ ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న పండు మాస్టర్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం వద్ద జరిగిన ఈ ఘటనతో ఆయన అభిమానులు, బుల్లితెర వర్గాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. ఆయన కాళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇక నడవలేరంటూ సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో యాక్టర్ నందు పండు మాస్టర్ హెల్త్ కండిషన్‌పై స్పందిస్తూ అసలు నిజాలను బయటపెట్టారు. ఆ వివరాలేంటో చూద్దాం.

అసలు ప్రమాదం ఎలా జరిగింది?:

తగరపువలసలో జరిగిన అమ్మవారి ఉత్సవాల్లో తన టీమ్‌తో కలిసి డాన్స్ ప్రోగ్రాం ముగించుకుని పండు మాస్టర్ కారులో హైదరాబాద్ కి తిరిగి వస్తున్నారు. ఈ ప్రయాణంలో టీమ్‌లోని ఒకరికి అస్వస్థత కావడంతో వాంతులయ్యాయి. దీంతో డ్రైవర్ కారును రోడ్డు పక్కన ఆపాడు. ఆ సమయంలో పండు మాస్టర్ కారు దిగి పక్కనే నిలబడ్డారు. సరిగ్గా అదే టైమ్‌లో వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ఒక కోళ్ల వ్యాన్ నియంత్రణ కోల్పోయి వీళ్ళ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పక్కనే ఉన్న పండు మాస్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

నెట్టింట పుకార్లు.. ఫ్యాన్స్ ఆందోళన:

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆయనను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. అయితే ఈ లోపే సోషల్ మీడియాలో పండు మాస్టర్ ఆరోగ్యంపై నెగిటివ్ ప్రచారం మొదలైంది. ఆయన కాళ్ళు పూర్తిగా పాడైపోయాయని, ఇకపై ఆయన ఎప్పటికీ నడవలేరంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ టెన్షన్లన్నింటికీ చెక్ పెడుతూ నటుడు నందు లైవ్‌లోకి వచ్చి క్లారిటీ ఇచ్చారు.

నందు ఇచ్చిన బిగ్ అప్‌డేట్:

యాక్టర్ నందు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దని కోరారు. "పండు మాస్టర్ చాలా ధైర్యంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన కాళ్లకు రెండు సార్లు ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆయన అందరితో బాగా మాట్లాడుతున్నారు. ఇక హాస్పిటల్‌కి తనను చూడటానికి వచ్చిన వాళ్ళను 'కాఫీ తాగారా?' అని ఆప్యాయంగా అడుగుతున్నారు" అని నందు చెప్పారు. పండు మాస్టర్ చాలా పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉన్నారని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ప్రమాదం పెద్దదే అయినా అభిమానుల ప్రార్థనలు, దేవుడి దయ వల్ల పండు మాస్టర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మన ముందుకు వస్తారని నందు నమ్మకం వ్యక్తం చేశారు. కాబట్టి ఎలాంటి రూమర్స్ నమ్మి కంగారు పడాల్సిన అవసరం లేదు. మనమంతా కూడా పండు మాస్టర్ త్వరగా కోలుకుని, మళ్లీ స్టేజ్ మీద తన డాన్స్‌తో దుమ్ములేపాలని కోరుకుందాం.




Tags:    

Similar News