ధనుష్ని తొక్కేయాలని చూస్తున్నదెవరు?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన తాజా చిత్రం కుబేర. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించాడు.;

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన తాజా చిత్రం కుబేర. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించాడు. జూన్ 20న కుబేర ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.
అందులో భాగంగానే చెన్నైలో ఆడియో లాంచ్ ను నిర్వహించగా అందులో ధనుష్ మాట్లాడుతూ తన హేటర్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. "సినిమా కోసం నా పనిని నేను ఎంతో శ్రద్ధగా చేసి ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా మీద, నా సినిమాల మీద విమర్శలు, నెగిటివ్ పబ్లిసిటీ చేసినా దాని వల్ల వారికి వచ్చేదేమీ లేదు. సినిమా రిలీజ్ కు ముందు నెలకు రెండుసార్లు ఏదో కాంట్రవర్సీ చేస్తూ కావాలని నాపై కుట్రలు చేస్తూ ఉంటారు" అని ధనుష్ అన్నాడు.
"ఎవరెన్ని చేసినా మీరేం చేయలేరు. ఎందుకంటే నాకు నా ఫ్యాన్స్ అండ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పటికైనా ఈ డ్రామాలను మానేయండి. ఈ ఆడియో లాంచ్ లో ఉన్నవాళ్లంతా కేవలం నా ఫ్యాన్స్ మాత్రమే కాదు, గత 23 ఏళ్లుగా నా పక్కనే ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్. మీరెన్ని విమర్శలు చేసినా, వీరంతా ఎప్పటికీ నాతోనే ఉంటారు" అంటూ ఫ్యాన్స్ ను ఉద్దేశించి ధనుష్ ఎమోషనల్ గా మాట్లాడాడు.
ఈ సందర్భంగా ఫ్యాన్స్ ను ఉద్దేశించి కూడా ధనుష్ ఓ మెసేజ్ ఇచ్చాడు. మన ఆనందం మనలోనే ఉంటుంది. దాని కోసం బయట వెతుక్కునే పన్లేదు. మనల్ని మనమే సంతోషంగా మార్చుకోవాలి. ఏం చేస్తే మనం సంతోషంగా ఉంటామో అదే చేయాలి. నా వరకు బాగా తింటే అదే ఆనందం అని ధనుష్ పేర్కొన్నాడు. అయితే ధనుష్ స్పీచ్ లో ఓ విషయం అర్థమైంది. కావాలని ఎవరో ధనుష్ ను టార్గెట్ చేసి అతన్ని వివాదాల్లో నిలుపుతున్నారని అర్థమవుతుంది. ఇంతకీ ధనుష్ పై అలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు? ధనుష్ ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశాడనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ గా మారింది.