చిరు కోసం 'ఫ్యామిలీ మ్యాన్'.. అసలు నిజమిదే..
ఒక కథ ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాస్తారో.. చివరకు అది ఎవరి చేతుల్లోకి వెళ్ళి రికార్డులు క్రియేట్ చేస్తుందో ఎవరూ ఊహించలేరు.
ఒక కథ ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాస్తారో.. చివరకు అది ఎవరి చేతుల్లోకి వెళ్ళి రికార్డులు క్రియేట్ చేస్తుందో ఎవరూ ఊహించలేరు. పాన్ ఇండియా రేంజ్ లో సంచలన విజయం సాధించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ విషయంలో కూడా అలాంటి ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ సిరీస్ క్రియేటర్స్ లో ఒకరైన దర్శకుడు రాజ్ నిడిమోరు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
రాజ్ నిడిమోరు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫ్యామిలీ మ్యాన్ కథను మొదట వెబ్ సిరీస్ గా కాదు, పూర్తి స్థాయి ఫీచర్ ఫిల్మ్ గా రూపొందించాలని భావించారు. అంతే కాదు, ఆ కథలోని లీడ్ రోల్ ను మెగాస్టార్ చిరంజీవిని దృష్టిలో ఉంచుకుని డెవలప్ చేశారట. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి.. ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు సీక్రెట్ ఆపరేషన్స్ ను నిర్వహించే వ్యక్తిగా ఆ పాత్రను ఊహించుకున్నట్లు చెప్పారు.
అదే సమయంలో చిరంజీవి ఖైదీ నెం.150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకున్నారు. అలాంటి స్టేజ్ లో ఇద్దరు పిల్లల తండ్రిగా కనిపించే రోల్ ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న పెద్ద డౌట్ వచ్చినట్లు తెలుస్తోంది. కథ నచ్చినప్పటికీ, ఇమేజ్ పరంగా ఆలోచించి ముందుకు వెళ్లలేదని అప్పట్లో వినిపించిన ప్రచారానికి ఇప్పుడు రాజ్ వ్యాఖ్యలు బలం చేకూర్చాయి.
కథలో మార్పులు చేయడానికి కూడా దర్శకులు సిద్ధమయ్యారట. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తగ్గించి, కొన్ని పాత్రల క్యారెక్టరైజేషన్ ను మార్చాలని భావించినా.. చివరకు ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో అదే ఆలోచనను మరింత ఎలబరేట్ చేసి వెబ్ సిరీస్ రూపంలో తీసుకొచ్చారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ నేషనల్ వైడ్ గా మంచి రెస్పాన్స్ అందుకుంది.
ఆ సిరీస్ విజయానికి ప్రధాన కారణంగా నిలిచిన అంశాల్లో ఒకటి శ్రీకాంత్ తివారీ రోల్. సాధారణ ఫ్యామిలీ పర్సన్ గా కనిపిస్తూ.. కొన్ని పరిస్థితులను ఎదుర్కొనే ఆ పాత్రలో నటుడు మనోజ్ బాజ్ పాయ్ అద్భుతంగా నటించారు. ఆ రోల్ ను ఆయన తప్ప మరెవరితోనూ ఊహించుకోలేని స్థాయిలో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అయితే ఆ కథ చిరంజీవి వరకు వెళ్లిందనే విషయం తెలిసిన తర్వాత అభిమానుల్లో మరో చర్చ మొదలైంది.
చిరంజీవి ఆ సమయంలో ఆ కథకు ఓకే చెప్పి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదన్న ప్రశ్న ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒకవేళ సినిమాగా తెరకెక్కి ఉంటే అదే స్థాయి విజయాన్ని సాధించేదా? లేక వెబ్ సిరీస్ గా మారడమే మంచిది అయిందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక రాజ్ నిడిమోరు విషయానికి వస్తే.. తిరుపతి బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన ఆయన, తన ఫ్రెండ్ కృష్ణ డీకేతో కలిసి బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
కొత్త తరహా కథలు, భిన్నమైన కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఓటీటీ వరల్డ్ లో తనదైన ముద్ర వేశారు. ఏదేమైనా ఒకప్పుడు చిరంజీవి కోసం రెడీ చేసిన కథ, ఆ తర్వాత వెబ్ సిరీస్ గా మారి పాన్ ఇండియా రేంజ్ లో మెప్పించింది. కొన్నిసార్లు రిజెక్ట్ చేసిన ఛాన్సులే కొత్త హిస్టరీలకు కారణం అవుతాయనడానికి ఫ్యామిలీ మ్యాన్ జర్నీ మరో పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది.