మెగాస్టార్ బాలీవుడ్ ప్ర‌యాణం వెన‌క నిర్మాత గొప్ప‌ త్యాగం!

మెగాస్టార్ చిరంజీవి త‌న నాలుగున్న‌ర ద‌శాబ్ధాల సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్లు రికార్డ్ బ్రేకింగ్ హిట్ చిత్రాల‌లో న‌టించారు.;

Update: 2026-04-29 03:50 GMT

మెగాస్టార్ చిరంజీవి త‌న నాలుగున్న‌ర ద‌శాబ్ధాల సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్లు రికార్డ్ బ్రేకింగ్ హిట్ చిత్రాల‌లో న‌టించారు. అయితే ఆయ‌న‌ బాలీవుడ్ ప్రయాణం 1990లో వచ్చిన `ప్రతిబంధ్` చిత్రంతో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. తెలుగులో ఘనవిజయం సాధించిన `అంకుశం` చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా ఉత్తరాది ప్రేక్షకులకు చిరంజీవిలోని నట ప్ర‌తిభ‌ను.. మాస్ ఇమేజ్‌ను పరిచయం చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా.. ఆయనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు నామినేషన్‌ను కూడా తెచ్చిపెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి జాతీయ స్థాయి గుర్తింపునకు `ప్రతిబంధ్` గట్టి పునాది వేసింది. నిజానికి అంకుశం చిత్రం యాంగ్రీ యంగ్ మేన్ రాజ‌శేఖ‌ర్ కి కూడా తెలుగులో గొప్ప గుర్తింపు తెచ్చి పెట్టింది.

అయితే మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ అరంగేట్రం వెనుక ఒక ఆసక్తికరమైన త్యాగం దాగి ఉంది. 1989లో చిరంజీవి, అమల జంటగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో `రాజా విక్రమార్క` సినిమా ప్రారంభమైంది. సరిగ్గా అదే సమయంలో చిరంజీవికి `ప్రతిబంధ్` అవకాశం రావడంతో కాల్‌షీట్ల సర్దుబాటు పెద్ద సమస్యగా మారింది. ఆ క్లిష్ట సమయంలో `రాజా విక్రమార్క`నిర్మాత అమర్నాథ్ రెడ్డి పెద్ద మనసు చేసుకున్నారు. ఒక‌ తెలుగు నటుడు హిందీలో రాణించడం గర్వకారణమని భావించిన ఆయన తన సినిమా కోసం కేటాయించిన డేట్స్‌ను హిందీ ప్రాజెక్టుకు బదలాయించి చిరంజీవి బాలీవుడ్ ఎంట్రీకి మార్గం సుగమం చేశారు.

`ప్రతిబంధ్` తర్వాత చిరంజీవి హిందీలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ 1992లో `ఆజ్ కా గూండా రాజ్` (గ్యాంగ్ లీడర్ రీమేక్) తో మరో విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 1994లో శంకర్ తమిళ చిత్రం `జెంటిల్‌మేన్`ను హిందీలో అదే పేరుతో మహేష్ భట్ దర్శకత్వంలో రీమేక్ చేశారు. ఇప్పటివరకు ఆయన నేరుగా మూడు హిందీ చిత్రాల్లో నటించగా.. సుదీర్ఘ విరామం తర్వాత 2019లో వచ్చిన`సైరా నరసింహారెడ్డి` పాన్ ఇండియా చిత్రంగా హిందీ ప్రేక్షకులను అలరించింది.

కానీ `ప్రతిబంధ్` ఇచ్చినంత ఊపును `ది జెంటిల్‌మేన్` ఇవ్వలేకపోయింది. తమిళ వెర్షన్‌లో ఉన్న వేగం, సామాజిక సందేశం హిందీ రీమేక్‌లో లోపించాయని విశ్లేషకులు భావించారు. హిందీ నేటివిటీ కోసం చేసిన మార్పులు కథలోని ఆత్మను దెబ్బతీయడం.. విద్యార్థుల సమస్యల కంటే వ్యక్తిగత కక్షకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. చిరంజీవి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నా.. బలహీనమైన కథనం కారణంగా ఈ చిత్రం నిరాశపరిచింది.

ఆరోజులే వేరు.. ఈరోజుల్లో అలాంటివి చూడ‌లేం:

సినీరంగంలో నిర్మాత‌- హీరో మ‌ధ్య అనుబంధం ఇటీవ‌ల అనూహ్యంగా మారింది. ఇప్పుడు ఉన్న‌వ‌న్నీ వ్యాపార సంబంధాలుగా మార‌డం దుర‌దృష్ట‌క‌రం. అమర్నాథ్ రెడ్డి వంటి ఆద‌ర్శ‌వంత‌మైన‌ నిర్మాతలు నేటి కాలంలో ఉండటం అరుదు. అయితే ఫిలింమేకింగ్ శైలి మార‌డంతో ఈ రోజుల్లో నిర్మాత‌లు వంద‌శాతం క‌మ‌ర్షియ‌ల్ గా మారార‌ని కూడా అంగీక‌రించాలి. అప్పట్లో బడ్జెట్లు పరిమితంగా ఉండేవి. ఇప్పుడు వందల కోట్ల వడ్డీలు.. భారీ సెట్స్, ఓవర్ హెడ్ ఖర్చులు త‌ప్ప‌నిస‌రి. ఒక్క రోజు షూటింగ్ ఆలస్యమైనా నిర్మాతపై పడే ఆర్థిక భారం కొన్ని లక్షల్లో ఉంటుంది. అందుకే నేటి నిర్మాతలు `ప్యాషన్` కంటే `ప్రొఫెషనలిజం` .. `అగ్రిమెంట్స్` కే ప్రాధాన్యత ఇస్తున్నారు.

ప్రస్తుత కాలంలో చాలా నిర్మాణ సంస్థలు కార్పొరేట్ పద్ధతుల్లో నడుస్తున్నాయి. ఇక్కడ నిర్ణయాలు వ్యక్తిగత భావోద్వేగాల మీద కాకుండా, లాభనష్టాల లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. అప్పట్లో ఒక నటుడు వేరే భాషలోకి వెళ్లడం అనేది కేవలం ఒక వ్యక్తిగత మైలురాయి. కానీ ఇప్పుడు ఒక నటుడు పాన్-ఇండియా స్టార్‌గా మారితే అది ఆ నిర్మాతకు కూడా మార్కెట్ పరంగా కలిసి వచ్చే అంశం. అందుకే ఇప్పుడు కొంతమంది నిర్మాతలు తమ హీరోల ఇతర ప్రాజెక్టుల కోసం సర్దుబాటు చేస్తున్నారు కానీ అది `త్యాగం` కంటే `వ్యాపార వ్యూహం` గానే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ కొంతమంది నిర్మాతలు తమ హీరోలతో ఉన్న వ్యక్తిగత అనుబంధం వల్ల షెడ్యూల్స్ మార్చుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ అమర్నాథ్ రెడ్డి చిరంజీవి కోసం తన సినిమా డేట్స్‌ను పూర్తిగా వదులుకున్నంత `నిస్వార్థమైన త్యాగం` ఈ రోజుల్లో చూడటం చాలా కష్టం.

Tags:    

Similar News