టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్: బాహుబలి ఫార్ములా వర్సెస్ టైమ్ గ్యాప్!
ఈ క్రమంలో టాలీవుడ్లో సంచలనం సృష్టించిన `బాహుబలి` ఫార్ములాను ఇండస్ట్రీ ప్రముఖులు ఏ విధంగా ఫాలో అవుతున్నారో ఓసారి చూద్దాం.
ప్రస్తుతం పరిశ్రమలో సీక్వెల్స్ -మల్టీ-పార్ట్ చిత్రాల హవా ఏ స్థాయిలో నడుస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని సినిమాలు తక్కువ గ్యాప్ లోనే పార్ట్-2 తో వస్తుండగా.. మరికొన్ని భారీ ప్రాజెక్ట్ల కోసం దర్శక నిర్మాతలు ఏళ్ల తరబడి సమయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్లో సంచలనం సృష్టించిన `బాహుబలి` ఫార్ములాను ఇండస్ట్రీ ప్రముఖులు ఏ విధంగా ఫాలో అవుతున్నారో ఓసారి చూద్దాం.
బాహుబలి ట్రెండ్కు శ్రీకారం:
సీక్వెల్స్ ట్రెండ్కు అసలు సిసలు బీజం వేసిన దర్శకధీర ఎస్.ఎస్. రాజమౌళి. `బాహుబలి` మొదటి భాగాన్ని 2015లో విడుదల చేసి రెండో భాగం కోసం ఏకంగా రెండేళ్లు ప్రేక్షకులను వెయిట్ చేయించారు. ఆయన బాటలోనే ప్రశాంత్ నీల్ `కేజీఎఫ్` మొదటి పార్ట్ను 2018లో రిలీజ్ చేసి రెండో భాగాన్ని తీరిగ్గా 2022లో విడుదల చేశారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేయడంతో సెకండ్ పార్ట్లపై హైప్ విపరీతంగా పెరిగింది. క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఉండాలంటే ఈ మాత్రం టైమ్ గ్యాప్ తప్పట్లేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
సుకుమార్- బోయపాటి రూట్
`పుష్ప` విషయంలో దర్శకుడు సుకుమార్ కూడా సరిగ్గా ఇదే ఫార్ములాను అప్లై చేశారు. డిసెంబర్ 2021లో మొదటి భాగం రిలీజ్ చేస్తే పార్ట్-2 కోసం మూడేళ్లు సమయం తీసుకుని 2024 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇలా సుదీర్ఘ సమయం అనంతరం `పుష్ప ది రూల్` బాక్సాఫీస్ వద్ద అన్ని ఇండస్ట్రీ రికార్డులను కుదేలు చేసింది. అలాగే నందమూరి బాలకృష్ణ నటించిన `అఖండ` మొదటి భాగం డిసెంబర్ 2021లో రిలీజ్ అయితే.. దాని సీక్వెల్ కోసం బోయపాటి శ్రీను ఏకంగా నాలుగేళ్ల పాటు సమయం తీసుకున్నారు .
భారీ సీక్వెల్స్ కోసం భారీ కసరత్తు
ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలే కాకుండా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న కొన్ని క్రేజీ సీక్వెల్స్కు కూడా ఇదే ఫార్ములా రిపీట్ అవుతోంది. `కల్కీ 2`, `సలార్ 2`, `దేవర 2`, `ఓజీ` వంటి చిత్రాలకు కూడా దర్శకులు పార్ట్-1 నుంచి కనీసం రెండు నుంచి మూడేళ్ల గ్యాప్ తీసుకుంటున్నారు. మొదటి భాగం క్రియేట్ చేసిన ఇంపాక్ట్ను మించి రెండో భాగం ఉండాలన్న కసితో దర్శకులు స్క్రిప్ట్పై గట్టిగా కూర్చుంటున్నారు. ఎంత సమయం పట్టినా ఆడియన్స్ అంచనాలను పూర్తిస్థాయిలో రీచ్ అవ్వాలన్నదే దర్శకుల టార్గెట్ గా కనిపిస్తోంది.