తహసీల్దార్ గా మారిపోయిన వైసీపీ ఎంపీ

Update: 2021-09-01 04:39 GMT
సినిమా తారలు రాజకీయంలోకి వచ్చి సీఎంలు అయిన వారు ఎందరో ఉన్నారు.. సినీ తారలను ప్రజలు పిచ్చిగా ప్రేమించి ఆదరించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లాంటి వారు సినిమాల్లో, రాజకీయాల్లో రాణించారు. రాజకీయాలు, సినిమాలు రెండూ ప్రజలను విపరీతంగా ప్రభావితం చేసే రంగాలు. ఈ రెండింటికి ప్రజల విశేషమైన ఆదరణ కావాలి.. ఇక ఈ రెండు రంగాల మధ్య ఉన్న సన్నని గీత కూడా చెరిగిపోయింది.

రాజకీయాల్లోకి వెళ్లిన వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తాజాగా సినిమాల్లోకి వచ్చేశారు. ఆయన ముఖానికి రంగం వేసుకున్నారు. ‘తహసీల్దార్’ పాత్రలో ఒదిగిపోయారు. బ్రిటీష్ కాలం నాటి తహసీల్దార్ పాత్రలో నటించారు. విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తాజాగా ‘ఒకే ఒక్కడు అల్లూరి సీతారామరాజు’ అనే సినిమా కోసం ఇలా మారాడు.

విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన కొంతమంది ఔత్సాహికులు ‘అల్లూరి’పై సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కీలకమైన బ్రిటీష్ తహసీల్దార్ పాత్రను ఎంవీవీ సత్యనారాయణ పోషించారు.దీనికోసం ముఖానికి రంగు వేసుకున్నారు. క్యారెక్టర్ లోకి ఒదిగిపోయిన ఆయన్ను ఆయన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు కూడా గుర్తు పట్టకపోవడం విశేషం. ఈ షూటింగ్ మూడు రోజుల పాటు ఉంటుందని.. సినిమా రంగంపై ప్రేమతో ఈ సినిమా చేస్తున్నానని వైసీపీ ఎంపీ తెలిపారు.

ఇదివరకే సత్యనారాయణ టాలీవుడ్ లో కొన్ని సినిమాలు తీసిన నిర్మాతగా అనుభవం ఉంది. ఇప్పుడు రాజకీయ బిజీలో కాస్త సినిమాలకు విరామం ఇచ్చారు. అయితే ఆయనలోని కళాకారుడు కూడా తాజాగా బయటకు వచ్చాడు.

విశాఖలో పుట్టి మన్నెం దొరగా పేరు గడించి తెల్లదొరలను ఎదురించిన అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర మీద తీస్తున్న సినిమాలో ఈ వైసీపీ ఎంపీ నటిస్తున్నారు. విశాఖకు చెందిన వారే ఈ సినిమా నిర్మిస్తున్నారు.

సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించడానికి విశాఖ ఎంపీ ఓకే చెప్పాడు... అల్లూరి మీద సినిమా కావడం.. పైగా దేశభక్తి సినిమా కావడంతో ఈ వైసీపీ ఎంపీ ఏకంగా నటించడానికి అంగీకరించడం విశేషం. ఈసినిమా షూటింగ్ లో ఎంపీ పాల్గొన్నారు. ఇలా రాజకీయాల నుంచి నటనలోకి వైసీపీ ఎంపీ ప్రవేశిస్తున్నారు.




Tags:    

Similar News