దేశ‌భ‌క్తి చిత్రంతోనే లేడీ సూప‌ర్ స్టార్ ఈగోకి సంతృప్తి!

Update: 2021-02-22 07:30 GMT
దాదాపు 13 సంవత్సరాల తరువాత లేడీ సూప‌ర్ స్టార్ విజయశాంతి రాజకీయాల నుండి కొంత విరామం తీసుకొని `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. మహేష్ తో స‌రిస‌మాన‌మైన పాత్ర‌లో ప‌వ‌ర్ ఫుల్ పెర్ఫామెన్స్ తో న‌టించి మెప్పించారు. స‌రిలేరు నీకెవ్వ‌రు సంక్రాంతి బ‌రిలో రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకుంది.

ఈ చిత్రం విడుదలైన తర్వాత అవార్డులు కూడా ద‌క్కించుకున్నారు విజ‌య‌శాంతి. కొంత‌కాలంగా సినిమాల్ని వద‌లి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో క‌నిపిస్తున్నారు. అంతేకాదు... ఇకపై నటన పట్ల ఆసక్తి లేదని కూడా అన‌డం అభిమానుల్ని నిరాశప‌రిచింది. కానీ ఇ‌పుడు విజయశాంతి మనసు మార్చుకున్నార‌ని తెలుస్తోంది.

తాజా స‌మాచారం ప్రకారం.. విజయశాంతి క‌థానాయిక‌గా `భారతరత్న` చిత్రాన్ని నిర్మించిన ప్రతిమా ఫిల్మ్స్ బ్యాన‌ర్ విజయశాంతి కోసం దేశభక్తి డ్రామాతో స్క్రిప్ట్ ని సిద్ధం చేయిస్తోంద‌ని తెలిసింది. ఫైర్ ‌బ్రాండ్ విజ‌య‌శాంతి ని ఈ కథ గొప్ప‌గా ఆకట్టుకుంది. ప్రాజెక్టుపై సంతకం చేయడానికి ఆసక్తిగా ఉన్నార‌ని తెలిసింది. కాశ్మీర్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న దేశ‌భ‌క్తి ప్ర‌ధాన చిత్ర‌మిది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. భార‌త‌ర‌త్న‌కు సీక్వెల్ క‌థాంశ‌మా కాదా? అన్న‌ది చిత్ర‌బృందం ప్ర‌క‌టించాల్సి ఉంటుంది.
Tags:    

Similar News