వెంకీ హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమట!

Update: 2021-06-17 10:30 GMT
టాలీవుడ్ సీనియర్ హీరోలంతా కూడా ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు. చిరంజీవి 'ఆచార్య' సినిమాతోను .. బాలకృష్ణ 'అఖండ' సినిమాతోను తీరిక లేకుండా ఉన్నారు. ఇక నాగార్జున ఒక యాక్షన్ మూవీతో సెట్స్ పై ఉన్నారు. వీళ్లందరి కంటే వెంకటేశ్ మరింత ఫాస్టుగా ఉన్నారు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలను ఆయన లైన్లో పెట్టేశారు. తమిళంలో సూపర్ హిట్ అనిపించుకున్న 'అసురన్' రీమేక్ గా ఆయన 'నారప్ప' చేశారు. వెంకటేశ్ లుక్ చూసే ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయమనే అభిప్రాయానికి అభిమానులు వచ్చేశారు.

ఇక మలయాళంలో 'దృశ్యం 2' సినిమాకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆ సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. వెంకటేశ్ - మీనా జంటగా ఈ సినిమా రూపొందింది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగును ఇటీవలే పూర్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నారు. ఆల్రెడీ మలయాళ 'దృశ్యం 2' హిట్ టాక్ తెచ్చుకోవడం వలన, తెలుగులోను విజయం ఖాయమని చెప్పుకుంటున్నారు. భారీ లాభాలు కూడా తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తమిళ .. మలయాళ రీమేక్ లను ఒకే సమయంలో పూర్తి చేసి పెట్టేసిన వెంకటేశ్, స్ట్రైట్ సినిమాగా 'ఎఫ్ 3' సినిమా చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంచలన విజయాన్ని నమోదు చేసిన 'ఎఫ్ 2' సినిమాకి ఇది సీక్వెల్.

'ఎఫ్ 2' చేసిన సందడి కారణంగా సీక్వెల్ పై భారీ అంచనాలే ఉన్నాయి. 'ఎఫ్ 2'కి మించిన వినోదాన్ని ఈ సినిమా పంచుతుందని అనిల్ రావిపూడి చెప్పడం వలన అందరిలో మరింతగా ఆసక్తి పెరిగింది. ఇటు టాక్ .. అటు కంటెంట్ పరంగా చూసుకుంటే, ఈ మూడు సినిమాలతో వెంకటేశ్ వరుస హిట్లు అందుకోవడం ఖాయమని అభిమానులు చెప్పుకుంటున్నారు.


Tags:    

Similar News