ఆ తమిళ హీరోకు కేసీఆర్.. జగన్ లు బాగా తెలుసట!

Update: 2020-01-23 17:30 GMT
తెలుగు సినీ ప్రేక్షకులకు ఉదయ నిధి పరిచయం తక్కువ. ఒకవేళ.. దివంగత మహానేత కరుణానిధి మనమడు అన్నంతనే.. ఓహ్.. ఆ కుర్రాడా? అని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తారు కొందరు. ఎంపిక చేసుకున్న సినిమాలు ఓవైపు.. రాజకీయాలు మరోవైపు చేస్తూ.. రెండు పడవల మీద ప్రయాణాన్ని బ్యాలెన్స్ గా చేసుకొస్తున్నారు. తాజాగా ఆయన సైకో అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి కోలీవుడ్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఈ సినిమాకు వెళ్లిన ప్రేక్షకులు భయంతో వణికిపోవటం ఖాయమంటున్నారు. ఇదిలా ఉంటే.. ఉదయనిధికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాగా తెలుసని చెబుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంలో తండ్రి స్టాలిన్ తో పాటు తాను కూడా వచ్చానని చెప్పారు. తన తండ్రికి జగన్ చాలా ఏళ్లుగా తెలుసని చెప్పిన ఉదయ నిధి.. ప్రమాణస్వీకారం రోజున రాజకీయాల ప్రస్తావన పెద్దగా రాలేదన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో తమ ఇంటికి వచ్చారన్నారు. ఆయనతో కూడా తనకు పరిచయం ఉందన్నారు. ఇలా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుసన్నారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల సమయంలో పగలంతా పార్టీ తరఫున ప్రచారం చేశానని.. రాత్రిపూట సినిమాల్లో నటించానని.. అప్పుడు షూట్ చేసిందే సైకో మూవీనని చెప్పారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన సందర్భంగా తాను చేసిన ట్వీట్ ఎవరిని ఉద్దేశించి కాదన్నారు. పార్టీలో వయసు మీద పడిన వారంతా భద్రంగా ఇళ్లల్లోనే ఉండమని తాను చేసిన వ్యాఖ్య ఎవరినీ ఉద్దేశించి కాదన్నారు. అయితే.. ఈ వ్యాఖ్య డీఎంకేలో పెను దుమారమే రేగింది.


Tags:    

Similar News