'సర్కారు' సెట్స్‌లో త్రివిక్రమ్.. గొడవ తీరినట్లేనా?

Update: 2022-05-09 03:30 GMT
టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడైన త్రివిక్రమ్ శ్రీనివాస్‌ చాలా వరకు వివాదాలకు దూరంగానే ఉంటాడు కానీ.. ఆయన కెరీర్లోనూ కొన్ని వివాదాలు లేకపోలేదు. తెలుగులో ప్రస్తుతం అతి పెద్ద నిర్మాణ సంస్థ అనదగ్గ మైత్రీ మూవీ మేకర్స్‌తో ఆయనకు చాన్నాళ్ల నుంచి ఓ వివాదం నడుస్తున్నట్లు ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం గతంలో మైత్రీ సంస్థలో ఓ సినిమాకు త్రివిక్రమ్ ఒప్పందం చేసుకున్నాడు. పెద్ద మొత్తంలో అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఐతే అనుకున్న సమయానికి సినిమా చేయలేకపోయాడు. ఎంతకీ ప్రాజెక్ట్ ఓకే కాక అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది.

ఐతే అడ్వాన్స్ తిరిగివ్వడం అంటే మామూలుగా కాదు.. డబ్బులు తీసుకున్నప్పటి నుంచి తిరిగిచ్చే సమయానికి వడ్డీతో కలిపి మైత్రీ వాళ్లు వసూలు చేశారట.  ఇది త్రివిక్రమ్‌ను బాగా హర్ట్ చేసిందని.. దీనికి బదులు తీర్చుకునే క్రమంలో మైత్రీ సంస్థలో పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయిస్తున్నాడని.. 'బీమ్లా నాయక్' లాంటి వేరే ప్రాజెక్టులు సెట్ చేయించి 'భవదీయుడు భగత్ సింగ్' పట్టాలెక్కకుండా చేస్తున్నాడని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరిగింది. రెండేళ్ల ముందే అనౌన్స్ అయిన 'భవదీయుడు భగత్ సింగ్' ఇంకా పట్టాలెక్కకపోవడం చూస్తే ఈ ప్రచారం నిజమే అనిపించింది. తాజాగా పవన్‌తో 'వినోదియ సిత్తం' అనే తమిళ చిత్రం రీమేక్‌ను తెర మీదికి తేవడం కూడా ఇందులో భాగమే అన్న సందేహాలు రేకెత్తాయి.

ఐతే ఈ మధ్య మైత్రీ వాళ్లతో త్రివిక్రమ్‌కు ప్యాచప్ అయినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.  ముందు 'వినోదియ సిత్తం' రీమేక్ గురించి జోరుగా వార్తలొచ్చాయి కానీ.. తర్వాత దాని ఊసే లేదు. ఆ ప్రాజెక్ట్ దాదాపుగా క్యాన్సిల్ అయినట్లే కనిపిస్తోంది. పైగా 'భవదీయుడు భగత్ సింగ్' జూన్లోనే సెట్స్ మీదికి వెళ్లనున్నట్లు కూడా అప్‌డేట్ వచ్చింది. ఇక శనివారం రిలీజ్ చేసిన 'సర్కారు వారి పాట'లోని మ మ మహేషా సాంగ్ లిరికల్ వీడియోలో త్రివిక్రమ్ కనిపించాడు. ఇది మైత్రీ వారి సిినిమా అన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా సెట్స్‌లో త్రివిక్రమ్ ఉన్నాడంటే.. ఆ నిర్మాతలతో విభేదాలు సమసిపోయినట్లే అని భావించాలి.
Tags:    

Similar News