చరణ్ తో ఆ సీన్ గురించి చెప్పడానికి చాలా భయపడ్డా: సుకుమార్

Update: 2021-05-07 08:30 GMT
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ''రంగస్థలం''. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఎమోషనల్‌ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 2018 మార్చి 30న విడుదలై అప్పటి వరకు ఉన్న టాలీవుడ్‌ రికార్డులన్నీ బ్రేక్ చేసింది. ఇందులో చెవిటి వాడైన చిట్టిబాబు పాత్రలో చరణ్ అద్భుతమైన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక పల్లెటూరి అమ్మాయి రామలక్ష్మిగా సమంత అక్కినేని అదరగొట్టింది. ఈ సినిమా సక్సెస్ లో దేవిశ్రీప్రసాద్ సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. అయితే తాజాగా సుకుమార్ ఓ సందర్భంలో 'రంగస్థలం' సినిమాలో రామ్‌ చరణ్‌ పాత్రకు సంబంధించిన ఓ విషయాన్ని వెల్లడించారు.

'రంగస్థలం' స్టోరీ విన్న వెంటనే చరణ్ ఓకే చేసాడని.. ఆయనకు ఆ స్క్రిప్ట్ అంత బాగా నచ్చిందని సుక్కూ తెలిపాడు. అయితే అంతా బాగానే ఉన్నా ఓ సీన్ గురించి చరణ్ కు వివరించడానికి చాలా భయపడ్డానని చెప్పారు. ఈ సినిమాలో కథలో భాగంగా కోమాలోకి వెళ్లిన ప్రకాష్ రాజ్‌ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు చరణ్ ఆయనకు అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. గడ్డం గీయడం, బట్టలు మార్చడం, ఆఖరికి టాయిలెట్‌ బ్యాగ్‌ కూడా తీయాల్సి ఉంటుంది. అందుకే ఆ సన్నివేశం గురించి చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాను. టెన్షన్‌ పడుతూనే వివరించాను. కానీ చరణ్‌ మాత్రం చేసేద్దామని కూల్‌ గా అన్నాడు. అలాంటి ఆన్సర్‌ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చరణ్‌ దాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి చేశారు. ఏ పాత్రనైనా చేయగలగడం ఒక నటుడికి ఉండాల్సిన లక్షణం. చరణ్‌ వంద శాతం తన పాత్రకు న్యాయం చేశారని సుకుమార్‌ చెప్పుకొచ్చారు. ఇకపోతే సుకుమార్ 'రంగస్థలం' క్లైమాక్స్ లో చరణ్ చేసిన సపర్యలన్నీ ఒక డైలాగ్ రూపంలో ప్రకాష్ రాజ్ కు చెప్పించడం గమనార్హం.
Tags:    

Similar News