థియేట‌ర్ బిజినెస్ హీరోలంతా అదే మోజులో ఉన్నారా?

Update: 2021-03-24 01:30 GMT
భార‌త‌దేశంలో .. తెలుగు రాష్ట్రాల్లో భ‌విష్య‌త్ అంతా మ‌ల్టీప్లెక్సుల‌దే అన్న‌ది ఒక స‌ర్వే. జ‌నాల దృష్టి ఇటీవ‌ల సింగిల్ థియేట‌ర్ల కంటే మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌పైనే ఎక్కువ‌గా ఉంది. అందుబాటులో ఉన్న మ‌ల్టీప్లెక్స్ కి వెళ్లి సినిమా చూసేందుకే ఎక్కువ ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు.

దేశవ్యాప్తంగా మనకు 7500 థియేటర్లు ఉన్నాయి. కానీ మన జనాభా దామాషా ప్రకారం మనకు మరో 40 వేల థియేటర్లు కావాల‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1500 థియేటర్లు ఉన్నాయి. మన తెలుగు ప్రేక్షకులకు సినిమాలను చేరువ చేయడానికి కనీసం మరో వెయ్యి థియేటర్లు కావాలన్న అంచ‌నా ఉంది. కానీ ఎవరూ ఈ అంశంపై దృష్టి పెట్టకపోవడం చాలా దురదృష్టకరం అని ఇటీవ‌ల ఓ విశ్లేష‌కుడు విశ్లేషించారు.ప్రొడక్షన్ - ఎగ్జిబిషన్ - డిస్ట్రిబ్యూషన్ వంటి శాఖల్లో సుదీర్ఘమైన అనుభవం కలిగిన విశ్లేష‌కుల‌ ప్ర‌కారం...మునుముందు తెలుగు రాష్ట్రాల్లో మ‌ల్టీప్లెక్సుల హ‌వా పెరిగేందుకు ఆస్కారం క‌నిపిస్తోంది.

నిజానికి ఓటిటి వచ్చిన తర్వాత థియేటర్లు మూతబడడం ఖాయమేమో అన్న అనుమానాల‌ను ప‌లువురు కొట్టి పారేసారు. ఎంటర్ టైన్మెంట్ రంగంలో ఏదైన కొత్త ప్రక్రియ ప్రారంభం అయిన ప్రతిసారి... ఇటువంటి అనుమానాలు తలెత్తడం సహజం. టీవీలు ఇళ్లల్లో తిష్ట వేసినప్పుడు, వీడియో పార్లర్లు వచ్చినప్పుడు కేబుల్ టీవీ హవా నడిచినప్పుడు... ఇలా ప్రతిసారి థియేటర్లు మూతపడతాయనే అనవసర చర్చ సాగింది. కానీ అనుకున్న‌దేదీ జ‌ర‌గ‌లేదు.ఇంటికి పది పదిహేను పర్లాంగుల దూరంలోనే అన్నీ అందుబాటులో ఉన్న నేటి తరుణంలో... థియేటర్లు మాత్రం అత్యధిక జనాభాకు పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండడం విచారకరం.

చైనాలో 50 వేల పైచిలుకు థియేటర్లు ఉండడం వల్లే అక్కడ విడుదలయ్యే సినిమాలు వందల కోట్లు అవలీలగా వసూలు చేస్తున్నాయి. అదే తీరుగా మ‌న‌కు థియేటర్లు పెరిగితే క‌లెక్ష‌న్స్ పెరిగే వీలుంది. జ‌నాల‌కు చేరువ‌గా థియేట‌ర్లు ఉంటే ఇంకా ఎక్కువ క‌లెక్ష‌న్స్ పెరుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.  చైనాలో ఉన్నట్లు... మన ఇండియాలో కూడా అధిక థియేటర్లు లేక‌పోవ‌డం పెద్ద లోటుగా క‌నిపిస్తోంద‌ని విశ్లేషిస్తున్నారు.

ఇక మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల రంగంలోకి మ‌న టాప్ స్టార్ల ప్ర‌వేశం కొత్త ఊపు తెస్తుంద‌నే అంచ‌నా వేస్తున్నారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ .. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్ప‌టికే ఏషియ‌న్ సినిమాస్ తో టై అప్ అయ్యి పెద్ద మ‌ల్టీప్లెక్స్ థియేటర్ల చెయిన్ ని న‌డిపించే ప్లాన్ లో ఉన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో వీరంతా థియేట‌ర్ బిజినెస్ ని విస్త‌రించే ప్లాన్ చేస్తున్నారు. మ‌రోవైపు డార్లింగ్ ప్ర‌భాస్ నెల్లూరు స‌హా ఇత‌ర చోట్ల‌కు థియేట‌ర్ల‌ను విస్త‌రించే అవ‌కాశం ఉంది.

ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఏషియ‌న్ సినిమాస్ తో క‌లిసి ఏవీడి సినిమాస్ ని ప్రారంభిస్తున్నారు. ఇక ఇత‌ర హీరోల్లో రామ్ చ‌ర‌ణ్ కి థియేట‌ర్ రంగంపై ఆస‌క్తి ఉందని ప్ర‌చార‌మైంది.ఇక ప‌లువురు ద‌ర్శ‌కులు నిర్మాత‌లు కొన్ని సింగిల్ థియేట‌ర్ల‌ను క‌లిగి ఉన్నారు. మునుముందు ప‌లువురు హీరోలు ఈ రంగంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News