నాగ్ ఫాంహౌస్ లో చనిపోయిందెవరు?

Update: 2019-09-20 05:14 GMT
సంచలనంగా మారిన ప్రముఖ నటుడు నాగార్జున ఫామ్ హౌస్ లో బయటపడిన  గుర్తు తెలియని మృతదేహం డిటైల్స్ బయటకు వచ్చాయి. దాదాపు ఏడాది క్రితం మరణించినట్లుగా భావించినప్పటికీ.. బయటకొచ్చిన ఆధారాల ప్రకారం అంతకంటే ఎక్కువ కాలం క్రితమే చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు.  ఈ డెడ్ బాడీ పూర్తిగా కుళ్లిపోయి.. ఎముకల గూడుగా మారిన సంగతి తెలిసిందే. దాని ఒంటి మీద ఉన్న బట్టలు తప్పించి.. బాడీ మొత్తం కుళ్లిపోయిన వైనం తెలిసిందే.

ఈ మృతదేహం జేబులో లభించిన ఆధార్ కార్డు సాయంతో అతనెవరన్న విషయాలు బయటకు వచ్చాయి. ప్రాధమిక ఆధారాలను అనుసరించి అతగాడు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు. నాలుగేళ్లుగా కనిపించకుండా పోయిన పాపిరెడ్డిగూడకు చెందిన 32 ఏళ్ల పాండుదే ఈ డెడ్ బాడీగా చెబుతున్నారు.

రంగారెడ్డి జిల్లాకు చెందిన పాండుకి పెళ్లి కాలేదని.. అతడికి తన మూడో అన్న కుమార్ అంటే ప్రాణమని.. అతను అనారోగ్యంతో చనిపోవటంతో మానసికంగా కుంగిపోయాడని చెబుతున్నారు. తన అన్న చనిపోయిన నాటి నుంచి తనకు దేని మీదా ఆశ లేదని చెప్పేవాడని.. అదే విషయాన్ని ఒక లేఖ మీద రాసి ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడని చెబుతున్నారు.

అనంతరం పాండు కోసం కుటుంబ సభ్యులు వెతికినా ప్రయోజనం లేకపోయిందంటున్నారు. కనిపించకుండా పోయినప్పటికి పోలీసులకు ఇంట్లోని వారెవరూ కంప్లైంట్ ఇవ్వలేదంటున్నారు. వారం క్రితమే ఈ వ్యవసాయ క్షేత్రానికి నాగ్.. అమల దంపతులు వెళ్లారు.  సేంద్రియ పద్దతులతో వ్యవసాయం చేయాలని కోరి.. కొందరికి పనులు అప్పగించటంతో.. వారు ఆ పనుల్లో భాగంగానే డెడ్ బాడీ గురించి బయటకు వచ్చి.. సంచలనంగా మారింది. దుస్తుల్లో దొరికిన వివరాల ప్రకారం అతడు ఎవరన్న విషయం మీద క్లారిటీ వచ్చింది.

ఇదిలా ఉండే.. పాండుకు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అతడి మరణానికి ముందు కుటుంబానికి చెందిన ఆస్తిని అమ్మటం ద్వారా అతడి వాటా కింద రూ.19 లక్షలు వచ్చాయని చెబుతున్నారు. అయితే.. ఆ మొత్తాన్ని తల్లి పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేయాలని.. తాను చనిపోయిన తర్వాత తన ఫోటో కూడా అన్న కుమార్ ఫోటో పక్కన పెట్టాలని కుటుంబ సభ్యులతో చెప్పేవాడని చెబుతున్నారు.
 
Tags:    

Similar News