శ్రీనివాసరెడ్డి.. మళ్లీ హీరోగా

Update: 2017-10-20 23:30 GMT
ఓవైపు కమెడియన్ గా నటిస్తూనే.. మరోవైపు హీరోగా ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు శ్రీనివాసరెడ్డి. అతను కథానాయకుడిగా నటించిన ‘గీతాంజలి’.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’.. ‘ఆనందో బ్రహ్మ’ మంచి ఫలితాన్నందుకున్నాయి. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి హీరోగా మరో సినిమా తెరకెక్కబోతోంది. ఇంతకుముందు సుమంత్ అశ్విన్ హీరోగా ‘రైట్ రైట్’ అనే సినిమా చేసిన మను ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. భలే భలే మగాడివోయ్.. మజ్ను.. ఊపిరి లాంటి సినిమాలతో తనదైన ముద్ర వేసిన మలయాళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతుండటం విశేషం. ఇది కామెడీ ప్రధానంగా సాగే రొమాంటిక్ మూవీ అట. ఓ కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. నటీనటులు.. ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.

సాధారణంగా కమెడియన్లు హీరోలుగా మారితే.. మళ్లీ హీరోగానే కంటిన్యూ అవ్వాలని చూస్తారు. హీరోగా ఛాన్సొస్తే ఆదరా బాదరా సినిమాలు చేసేస్తారు. కానీ శ్రీనివాసరెడ్డి ఇందుకు భిన్నం. అతను హీరోగా ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. మధ్యలో కామెడీ పాత్రలూ చేస్తున్నాడు. ఇటీవలే ‘రాజా ది గ్రేట్’లో కామెడీ పాత్రతో అలరించాడు. హీరోగా చేసిన మూడు సినిమాలూ సక్సెస్ అయినా ఆత్రపడలేదు. జాగ్రత్తగా తనకు నప్పే పాత్రలు ఎంచుకుని సినిమాలు చేస్తున్నాడు. తాను హీరోగా తెరకెక్కే సినిమాలకు నిర్మాతల్ని కూడా శ్రీనివాసరెడ్డే ఎంచుకుంటుండటం విశేషం.
Tags:    

Similar News