బాలయ్య మూవీలో లాక్‌డౌన్‌ రియల్‌ హీరో

Update: 2020-09-30 04:45 GMT
బాలకృష్ణ.. బోయపాటిలు మూడవ సారి కలిసి చేస్తున్న సినిమాపై అందరిలో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే వీరి కాంబో మూవీ ఇప్పటి వరకు పూర్తి అయ్యేది. కాని కరోనా లాక్‌ డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌ ఆరు నెలలుగా ఆగిపోయింది. ఎట్టకేలకు మళ్లీ సినిమా షూటింగ్‌ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కీలకమైన విలన్‌ పాత్రకు గాను బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సంజయ్‌ దత్‌ ను ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. ఆయనతో ఒప్పందం చేసుకోవాల్సి ఉండగా కరోనా వచ్చేసింది. సరే షూటింగ్‌ పునః ప్రారంభించే సమయంకు ఒప్పందం చేసుకోవచ్చు అనుకుంటూ ఉండగా సంజయ్‌ దత్‌ కు క్యాన్సర్ అంటూ నిర్థారణ అయ్యింది.

సంజయ్‌ దత్‌ ప్రస్తుతం కమిట్‌ అయిన సినిమాలు పూర్తి చేసి ట్రీట్‌ మెంట్‌ కోసం గ్యాప్‌ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అందుకే బాలయ్య బోయపాటిల మూవీని సంజయ్‌ దత్‌ ఒప్పుకునే అవకాశం లేదు. అందుకే విలన్‌ పాత్రను సోనూసూద్‌ తో చేయించాలనే నిర్ణయానికి వచ్చారట. లాక్‌ డౌన్‌ టైంలో మరియు ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ గురించి వచ్చిన వార్తలు మరెవ్వరి గురించి రాలేదు అనడంలో సందేహం లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆయన వలస కార్మికులను వారి వారి గమ్య స్థానాలకు చేర్చడంతో పాటు కష్టాల్లో ఉన్న వారి గురించి సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకుని వారికి సాయం చేయడం జరిగింది. అలా రియల్‌ హీరో అనిపించుకున్న సోనూసూద్‌ ను బాలయ్యకు విలన్‌ గా ఎంపిక చేయనున్నారట.

ప్రస్తుతం అల్లుడు అదుర్స్‌ సినిమా షూటింగ్‌ లో సోనూసూద్‌ పాల్గొంటున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీలక పాత్రలో ప్రకాష్‌ రాజ్‌ నటిస్తున్నాడు. తాజాగా ఆయన షూటింగ్‌ కోసం ముంబయి నుండి రాగా ఎయిర్‌ పోర్ట్‌ నుండి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత షూటింగ్‌ సెట్‌ లో అడుగు పెట్టిన సమయంలో కూడా యూనిట్‌ సభ్యులు అంతా కూడా చప్పట్లతో ఆహ్వానించి సన్మానించారు. మంచి క్రేజ్‌ ఉన్న సోనూసూద్‌ బిబి3 లో నటిస్తే సినిమాకు కూడా పాజిటివ్‌ బజ్‌ పెరిగే అవకాశం ఉందని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారట.
Tags:    

Similar News