లేటు వయసులో రాజ్యలక్ష్మి హీరోయిన్‌ గా ఎంట్రీ

Update: 2023-05-31 08:00 GMT
సింగర్ రాజ్యలక్ష్మి గురించి సోషల్‌ మీడియాను ఫాలో అయ్యే వారికి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. లేటు వయసులో పాపులారిటీని సొంతం చేసుకుని తక్కువ సమయంలోనే స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న సింగర్ రాజ్యలక్ష్మి. ఒక ఛానల్ నిర్వహించిన సింగింగ్ కార్యక్రమంలో భర్త సెంథిల్ తో కలిసి పాల్గొన్న రాజ్యలక్ష్మి ఆ కార్యక్రమం యొక్క విన్నర్ గా నిలిచిన విషయం తెల్సిందే.

సింగింగ్ కాంపిటీషన్ లో విజేతలుగా నిలిచిన సెంథిల్ మరియు రాజ్యలక్ష్మి గత కొన్నాళ్లుగా వరుసగా సినిమాల్లో పాటలు పాడుతూ ఉన్నారు. పుష్ప తమిళ వర్షన్ సామి సామి పాటను  రాజ్యలక్ష్మి పాడి మెప్పించిన విషయం తెల్సిందే. తమిళ ఆడియన్స్‌ తో పాటు సౌత్ ఇండియన్ ఆడియన్స్ ను తమ వాయిస్ తో సర్‌ ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి రాజ్యలక్ష్మి వార్తల్లో నిలిచారు.

32 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లల తల్లి అయిన రాజ్యలక్ష్మి హీరోయిన్ గా తమిళ సినీ ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ఇప్పటికే రాజ్యలక్ష్మి హీరోయిన్ గా సినిమా షూటింగ్‌ కూడా పూర్తి అయ్యింది. ఇటీవల సదరు సినిమా యొక్క ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది.

ఆ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. ఈ వయసులో ఇద్దరు పిల్లలకు తల్లి అయిన నేను హీరోయిన్‌ గా నటిస్తానని ఎప్పుడు కూడా ఊహించలేదు. దర్శకుడు ఫోన్‌ చేసి కథ చెప్పిన సమయంలో అందులో ఏ పాత్ర ను చేయాలని అడిగాను. హీరోయిన్ పాత్ర చేయాలి అని చెప్పగానే షాక్‌ అయ్యాను. నేను చేయగలనా అనుకున్నాను. కానీ నాతో చేయించారు.

కథానాయికగా ఎక్కువ శాతం మంది 20 ఏళ్ల లోపు లో ఎంట్రీ ఇస్తారు. ఒక్కరు ఇద్దరు పాతిక ఏళ్ల లోపు వయసు తో ఎంట్రీ ఇస్తారు. కానీ రాజ్యలక్ష్మి మాత్రం 32 ఏళ్ల వయసు లో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇవ్వడం కాస్త చర్చనీయాంశం అవుతోంది. రాజ్యలక్ష్మి హీరోయిన్‌ గా ముందు ముందు మరిన్ని సినిమాలు చేస్తుందా ఈ ఒక్క సినిమాతోనే ముగిస్తుందా అనేది చూడాలి.

Similar News