శర్వా మరిచిపోలేని ఒక లేఖ

Update: 2018-05-20 10:15 GMT
హీరో అన్నాక అమ్మాయిల నుంచి ప్రేమలేఖలు రాకుండా ఉండవు. వాటిలో కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. వాళ్ల మనసులపై బలమైన ముద్ర వేస్తాయి. తనను కూడా ఒక లేఖ కదిలించిందని.. కానీ అది ఒక అమ్మాయి రాసిన లేఖ కాదని.. ఒక తల్లి రాసిన లెటర్ అని.. అది తనకు ఒక జీవిత కాల జ్ఞాపకంగా మారిపోయిందని అంటున్నాడు యువ కథానాయకుడు శర్వానంద్. ఈ లేఖ గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పాడతను.

అనంతపురం నుంచి రేణు అనే మహిళ ‘అమ్మ చెప్పింది’ సినిమా చూసి శర్వాకు లేఖ రాసిందట. ‘నువ్వు నా కొడుకులాగా అనిపిస్తున్నావు. నాకో కూతురు ఉంది నా ఆస్తిలో సగం నీకు రాసిస్తా’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారట ఆమె. ఆ లేఖను తాను జాగ్రత్తగా దాచుకున్నానని.. ఆమె తన పుట్టిన రోజుకు ప్రతిసారీ ఖరీదైన బహుమతులు కూడా పంపుతుంటారని శర్వా వెల్లడించాడు. ఒకసారి ఆమెను తాను కలిశానని.. ‘నా ఆస్తి కూడా ఇస్తా. మీ కూతురికివ్వండి. నాకిచ్చే బహుమతులు తనకే ఇవ్వండి’ అని చెప్పానని శర్వా తెలిపాడు. ఆమె తనకు మరో తల్లిలా అనిపించిందని.. తన కుటుంబ సభ్యులతోనూ తాను మాట్లాడానని చెప్పాడు.

ఇక తనకు ఎన్ని ప్రేమలేఖలు వచ్చాయో తెలియదని.. తాను మాత్రం ఏ అమ్మాయికీ ప్రేమ లేఖ రాయలేదని శర్వా స్పష్టం చేశాడు. ఈ వయసులో అబ్బాయిల్లో ఉండే ఆకర్షణలన్నీ తనలోనూ ఉన్నాయని.. కాకపోతే ఏ అమ్మాయికీ ప్రేమ లేఖ రాయాలని అనిపించలేదని చెప్పాడు. తన పెళ్లి గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదని.. అది జరగాల్సినపుడు జరుగుతుందని శర్వా అన్నాడు.   


Tags:    

Similar News