సందీప్ కిషన్ - VI ఆనంద్ కాంబోలో సూప‌ర్ నేచుర‌ల్ ఫాంటసీ మూవీ..!

Update: 2021-05-07 04:59 GMT
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ కొత్తదనం ఉన్న కథలను ఎంచుకుంటూ విభిన్నమైన జోనర్స్ లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇటీవలే 'ఏ1 ఎక్స్‌ ప్రెస్‌' సినిమాతో ప్రేక్షకులను అలరించిన సందీప్.. ప్రస్తుతం 'గ‌ల్లీ రౌడీ' అనే చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు సందీప్ కిషన్ పుట్టినరోజును పురస్కరించుకుని మరో కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.

విలక్షణ దర్శకుడు వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా '#SK28' ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌ లో ఇంతకముందు 2015లో 'టైగ‌ర్‌' అనే సినిమా తెరకెక్కింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం దర్శక హీరోలకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ త‌ర్వాత వీరిద్దరూ క‌లిసి మళ్ళీ ప‌నిచేయాల‌నుకున్నా కుద‌ర‌లేదు. ఈ క్రమంలో ఆరేళ్ల త‌ర్వాత మ‌రోసారి సందీప్ కిష‌న్‌ - వీఐ ఆనంద్ కాంబోలో సినిమా రూపొందనుంది. తాజాగా ఈ సినిమాని ప్రకటించిన మేకర్స్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ని విడుదల చేశారు.

సందీప్ కిషన్ ఓ మిస్టీరియస్ ప్రదేశంలోకి చూస్తున్నట్లుగా డిజైన్ చేయబడిన '#SK28' పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సూప‌ర్ నేచుర‌ల్ ఫాంటసీ జోన‌ర్‌ లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' 'ఒక్క క్షణం' 'డిస్కోరాజా' వంటి డిఫరెంట్ సినిమాలు తెరకెక్కించిన VI ఆనంద్.. సందీప్ కిషన్ కోసం ఒక ఆసక్తికరమైన కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం మరియు సాంకేతిక నిపుణుల వివరాలు తరువాత వెల్లడించనున్నారు.
Tags:    

Similar News