చరణ్ పోయి పోయి ఆయన్ని పిలిచాడేంటి?

Update: 2017-01-04 12:05 GMT
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేడుకకు రంగం సిద్ధమవుతోంది. వాయిదాల మీద వాయిదాలు పడ్డ ‘ఖైదీ నెంబర్ 150’ ప్రి రిలీజ్ ఈవెంట్ ఈ నెల ఏడో తారీఖున గుంటూరు దగ్గర్లోని హాయ్ ల్యాండ్ మైదానంలో జరగబోతోంది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ మినహా మెగా ఫ్యామిలీ హీరోలందరూ హాజరవుతారని భావిస్తున్నారు. ఈ వేడుక కోసం ముఖ్య అతిథులుగా టాలీవుడ్ దిగ్గజ దర్శకులు దాసరి నారాయణరావు.. కె.రాఘవేంద్రరావులకు ఆహ్వానించడం విశేషం. ఐతే రాఘవేంద్రరావు విషయంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు కానీ.. ఈ వేడుకకు దాసరిని పిలవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవితో దాసరికి ఎలాంటి సంబంధాలున్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గతంలో చాలా వేడుకల్లో చిరంజీవిని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించాడు దాసరి. కొన్ని సార్లు చిరంజీవిని పొగిడిన మాట కూడా వాస్తవమే కానీ.. ఎక్కువసార్లు చిరును ఆయన టార్గెట్ చేసిన సంగతిని మెగా అభిమానులు మరిచిపోలేరు. ఐతే మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ‘ఖైదీ నెంబర్ 150’ చాలా ప్రత్యేకమైన సినిమా కావడం.. దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఆయన పునరాగమనం చేస్తున్న నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కులు అనదగ్గ ఇద్దరు లెజెండరీ డైరెక్టర్లను ఈ వేడుకకు పిలిచి గౌరవించాలని భావించి ఉండొచ్చు. తనను ఇంతగా గౌరవించాక.. చిరు పక్కనే ఉండగా.. వేలాది మంది మెగా అభిమానుల ముందు దాసరి ఆయనపై ఎలాంటి సెటైర్లు వేయకుండా పొగడ్తలు మాత్రమే గుప్పిస్తాడని చరణ్ అంచనా వేసి ఉండొచ్చేమో. ఐతే దాసరితో గత అనుభవాల దృష్ట్యా మాత్రం మెగా అభిమానులు చరణ్ పోయి పోయి ఈయన్ని ముఖ్య అతిథిగా పిలిచాడేంటని అనుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News