`సైమా 2021`ని ఎరుపెక్కించిన‌ వ్వాటే బ్యూటీ

Update: 2021-09-19 08:36 GMT
సైమా 2021 అవార్డుల వేడుక‌తో హైద‌రాబాద్ మ‌ళ్లీ రంగులమ‌యం అయింది. అన్ని భాష‌ల తార‌లు అవార్డు ఫంక్ష‌న్లో పాల్గొని వేడుక‌కు శోభ‌ను తీసుకొచ్చారు. ముఖ్యంగా హీరోయిన్లు డిజైనర్ దుస్తుల్లో  త‌ళుక్కున మెర‌వ‌డంతో ఆ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. చాలా కాలానికి ఈ మెరుపులు! అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఏడాదిన్న‌ర‌గా క‌రోనా భ‌యం గుప్పిట్లో బ‌తికిన జనం మ‌న‌సుల్లో నుంచి ఆ భ‌యం ఇప్పుడిప్పుడే నెమ్మ‌దిగా తొల‌గిపోతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ నెటిజ‌నులు క‌రోనా గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు సైమా 2021లో  పాల్గొన్న అంద‌గ‌త్తెల‌ గురించి మాట్లాడుకోవ‌డం విశేషం. హైద‌రాబాద్ లో వేడుక కావ‌డంతో దాదాపు టాలీవుడ్ భామలంతా ఈ వేడుక‌లో పాల్గొన్నారు.

త‌మ గ్లామ‌ర్ షోల‌తో కెమెరాల‌కు ఫోజులిచ్చి ఆక‌ట్టుకున్నారు. తాజాగా వ్వాటే బ్యూటీ ర‌ష్మిక మంద‌న ఎర్ర‌టి డిజైన‌ర్ దుస్తుల్లో త‌ళుక్కున మెరిసింది. ఎర్రటి తివాచీకి మ్యాచింగ్ డ్రెస్ లో వ్వాటే బ్యూటీ వ్వావ్ అనిపించింది. హాఫ్ షోల్డ‌ర్ ఎరుపు గౌను లో ర‌ష్మిక ప్ర‌త్యేకంగా చూప‌రుల‌ను ఆక‌ర్షించింది. త‌న గెట‌ప్ కి త‌గ్గ‌ట్టే లైట్ మేక‌ప్ వేసుకుంది. హెయిర్ ని రెండు భాగాలు చేసి కురుల్ని అలా గాలికి వ‌దిలేసింది. ఆ ఎర్ర‌టి తివాచీపై హోయ‌లు పోతూ న‌వ్వులు ఒలికించింది. ప్ర‌స్తుతం ఆ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అందాల‌న్ని ఒకే చోట చేసి కుర్రాళ్ల గుండెల్ని చిదిమేస్తున్నారంటూ  ఓ నెటిజ‌నుడు కామెంట్ చేసాడు. ర‌ష్మిక న‌వ్వుకు గుండె గుల్ల‌యిపోయింద‌ని వాపోయాడు మ‌రి.

ఇక ర‌ష్మిక సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స‌ర‌స‌న పుష్ప‌లో న‌టిస్తోంది. రెండు భాగాలు గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. మొద‌టి భాగం `పుష్ప‌:  ది రైజింగ్` టైటిల్ తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  క్రిస్మ‌స్ కానుక‌గా  రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అవుతుంది. ఇందులో ర‌ష్మిక గిరిజ‌న యువ‌తి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. అలాగే బాలీవుడ్ లో అమ్మ‌డు `మిష‌న్ మ‌జ్ను` సినిమాతో లాంచ్ అవుతుంది. ఇందులో సిద్దార్థ్ మ‌ల్హోత్రాతో  రొమాన్స్ చేస్తుంది. అమితాబ్ తో గుడ్ బాయ్ లోనూ న‌టించింది. భ‌విష్య‌త్ ని కూడా అక్క‌డే ప్లాన్ చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం.

ముంబైలో అపార్ట్ మెంట్ దేనికి?

ఇక ఇటీవ‌ల వ‌రుసగా హిందీ చిత్రాల‌తో బిజీ అయిపోయిన ర‌ష్మిక మంద‌న ముంబైలోని ఒక ఇంటిని సొంతం చేసుకోవాల‌నుకుంది.  ఈ బ్యూటీ హిందీ క‌మిట్ మెంట్ల వ‌ల్ల‌ ఓ అపార్ట్ మెంట్ లో తొలిగా అద్దెకు వెళ్లింది.  కానీ అలా ఉండ‌డం త‌న‌కు న‌చ్చ‌డం లేదు. అందుకే రష్మిక ఇటీవ‌ల‌ ముంబైలో ఇల్లు కొనుక్కుంది. దీనివ‌ల్ల స్టార్ హోట‌ల్లో బ‌స చేయాల్సిన అవ‌స‌రం త‌ప్పింది మ‌రి.

ర‌ష్మిక ఒక్కో సినిమాకి 4 కోట్ల మేర పారితోషికం డిమాండ్ చేస్తోంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికిప్పుడు పుష్ప డ్యూయాలజీతో పాటు శ‌ర్వానంద్ త‌దిత‌రులతో సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ భారీ గా పారితోషికాలు అందుకుంటోంది. అటు హిందీ చిత్రాల‌కు 4 కోట్లు మించి పారితోషికం ఆఫ‌ర్ చేసిన‌ట్టు ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి. క‌న్న‌డ న‌టుడు ర‌క్షిత్ తో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని ఇప్పుడిలా క‌థానాయిక‌గా నాలుగు చేతులా ఆర్జిస్తోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News