షాకింగ్‌: RRR త‌రువాత మ‌హేష్ తో లేన‌ట్టే?

Update: 2021-09-17 03:30 GMT
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌- మెగా ప‌వ‌ర్ స్టార్ ల తొలి క‌ల‌యిక‌లో ద‌ర్శ‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం `ఆర్.ఆర్.ఆర్‌`. అల్లూరి సీతారామ‌రాజు- కొమ‌రం భీమ్‌ల కాల్ప‌నిక క‌థ‌కి త‌న‌దైన మార్కు ఎలిమెంట్స్ ని జోడించి ఓ ఫిక్ష‌న‌ల్ స్టోరీని రాజ‌మౌళి తెర‌పై విజువ‌ల్ వండ‌ర్ గా రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ద‌స‌రా లేదా క్రిస్మ‌స్ (తేదీ ప్ర‌క‌టించాలి) కు థియేట‌ర్ల‌లోకి రావ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఇందు కోసం ఇప్ప‌టికే భారీ ఏర్పాట్ల‌ని చిత్ర బృందం చేయ‌డంలో త‌ల‌మున‌క‌లైంది.

ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత రాజ‌మౌళి ఎవ‌రితో సినిమా చేయ‌బోతున్నాడన్న‌ది ఇప్ప‌టికే రివీల్ చేసిన విష‌యం తెలిసిందే. మ‌హేష్ బాబు హీరోగా రాజ‌మౌళి త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీని ప్ర‌క‌టించారు కూడా. ఫారెస్ట్ నేప‌థ్యంలో సాగే అడ్వెంచ‌ర‌స్ మూవీగా ఈ చిత్రం వుండ‌బోతోంద‌ని కీల‌క స‌మాచారం కూడా బ‌య‌టికి వ‌చ్చేసింది. అయితే ఇంత‌లోనే ఊహించ‌ని మ‌లుపు. ఇక్క‌డో షాకింగ్ విష‌యం ఒక‌టి తాజాగా బ‌య‌టికి వ‌చ్చింది. `ఆర్.ఆర్.ఆర్‌` త‌రువాత మ‌హేష్ తో జ‌క్క‌న్న సినిమా చేయ‌డం లేద‌నేది ఆ గుస‌గుస సారాంశం.

మ‌హేష్ తో సినిమా చేయ‌డానికి ముందు జ‌క్క‌న్న ఓ బాలీవుడ్ చిత్రాన్ని చేయ‌బోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం మ‌హేష్ చేస్తున్న `స‌ర్కారి వారి పాట‌` వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో విడుద‌ల కాబోతోంది. ఈ మూవీ త‌రువాత కొంత విరామం తీసుకోబోతున్నారు మ‌హేష్‌. ఈ స‌మ‌యాన్ని మ‌రో సినిమా కోసం వాడుకోవాల‌నుకుంటున్నార‌ట జ‌క్క‌న్న‌. `మ‌గ‌ధీర‌` వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌రువాత రాజ‌మౌళి `మ‌ర్యాద రామ‌న్న‌` పేరుతో సునీల్ ని హీరోగా పెట్టి ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రాన్ని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. `ఆర్.ఆర్.ఆర్‌` త‌రువాత అదే ఫార్ములాని ఫాలో అవుతూ అతి త‌క్కువ బ‌డ్జెట్ లో ప్ర‌యోగాత్మ‌క చిత్రాన్ని చేయాల‌న్నది రాజ‌మౌళి ఆలోచ‌న‌గా తెలుస్తోంది.

ఈ సినిమాని పూర్తిగా బాలీవుడ్ న‌టీన‌టులు.. టెక్నీషియ‌న్ ల‌తో చేయ‌బోతున్నార‌ట‌. నెలంటే నెల రోజులు మాత్ర‌మే చిత్రీక‌ర‌ణ‌కు ఉప‌యోగించి మ‌రో నెల పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌.. మ‌రో నెల ప్ర‌మోష‌న్స్ చేసి సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌న్న‌ది రాజ‌మౌళి ఆలోచ‌న‌గా చెబుతున్నారు. అంతే కాకుండా ఈ చిత్రంలో ఎలాంటి స్టార్ లు వుండ‌ర‌ని,.. చిన్న న‌టుల‌తో ఈ మూవీని అత్యంత ప్ర‌యోగాత్మ‌కంగా చేయాల‌ని జ‌క్క‌న్న ప్లాన్ చేస్తున్న‌ట్టుగా తెలిసింది. అయితే దీనికి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారా? లేక ప‌ర్య‌వేక్ష‌కుడిగా వుంటారా? అన్న‌ది మాత్రం తెలియాల్సి వుంది.

రిలీజ్ తేదీపై ఇంకా డైల‌మా?

జ‌క్క‌న్న‌ పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ పై ఇంకా స‌రైన క్లారిటీ రాలేదు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీ అయినా రిలీజ్ పై మాత్రం ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌డం లేదు. దీంతో అభిమానుల్లో ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. ప‌రిస్థితులు బాగుంటే ఇప్ప‌టికే సినిమా రిలీజ్ అవ్వాలి. ఈ ఏడాది సంక్రాంతికే ప్రేక్ష‌కుల ముందుకు రావాలి. కానీ క‌రోనా రాక‌తో అన్ని తారుమార‌య్యాయి. అయితే తాజాగా రిలీజ్ పై యూనిట్ ఓ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు..దాదాపు అది ఖారారైన‌ట్లు క‌థ‌నాలొచ్చాయి.

ఈ ఏడాది అక్టోబ‌ర్ నుంచి సినిమా ముందుగా మార్చికి వాయిదా ప‌డిన‌ట్లు కొద్ది రోజులు క్రితం వార్త‌లొచ్చాయి. ఆ త‌ర్వాత క్రిస్మ‌స్ బ‌రిలో రిలీజ్ ఉంటుంద‌న్నారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలోనే రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారంలో కి వ‌చ్చింది. తాజాగా అదే నెల‌కి ఫిక్స్ అయిన‌ట్లు యూనిట్ వ‌ర్గాల నుంచి లీకైంది. జ‌న‌వ‌రి 8న చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేయ‌డానికి ఫిక్సైన‌ట్లు టాక్ వినిపించింది. ఈ తేదీపై రాజ‌మౌళి తుది నిర్ణ‌యం తీసేసుకున్నార‌ని ప్ర‌చార‌మైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌లో అతి త్వ‌ర‌లోనే వెలువ‌డ‌నుంద‌ని ప్ర‌చారం సాగింది. కానీ దేనిపైనా ఇంకా చిత్ర‌యూనిట్ అధికారికంగా స్పందించ‌లేదు. ఒక పెద్ద ప్రెస్ మీట్ తో జ‌క్క‌న్న క్లారిటీనిస్తార‌నే అంద‌రూ వెయిటింగ్.




Tags:    

Similar News