ఏకమైన నిర్మాతల మండలి.. సంచలన నిర్ణయాలు

Update: 2020-12-15 11:31 GMT
కరోనా కల్లోలంలో సినీ పరిశ్రమ కొట్టుకుపోయింది. చాలా దెబ్బతింది. లాక్ డౌన్ తో మూతపడిన థియేటర్లు ఇప్పటికీ తెరిచింది లేదు. ఇప్పుడిప్పుడే తెరిపించే ప్రయత్నాలు సాగుతున్నాయి. కరోనా దెబ్బకు నిర్మాతలు నిండా మునిగారు. దీంతో ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్య పరిష్కారానికి వారిప్పుడు పట్టుబడుతున్నారు.

ఇటీవల నిర్మాతల మండలి సమావేశాన్ని నిర్వహించుకున్నారు. ఇందులో తీసుకున్న పలు ఏకగ్రీవ నిర్ణయాల వివరాలను మంగళవారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు అందించామని గౌరవ కార్యదర్శులు టి. ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల తెలిపారు.

ప్రధానంగా ఇకపై వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎస్) చెల్లించమని నిర్మాతలు స్పష్టం చేశారు. దీంతోపాటు కంటెంట్ ట్రాన్స్ పోర్ట్ నిమిత్తం నిర్మాతలు నామమాత్రపు ఛార్జీలు చెల్లిస్తామని చెబుతున్నారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల ప్రొజెక్టర్లను డిజిటల్ ప్రొవైడర్స్ నుంచి థియేటర్ల యాజమాన్యాలు కొనుగోలు చేయవచ్చని తెలిపారు.

ఈ విషయంలో డిజిటల్ ప్రొవైడర్స్ అంగీకరించకపోతే థియేటర్ల యజమానులు సొంత ప్రొజెక్టర్లతో నడిపిస్తామని స్పష్టం చేశారు. డిసెంబర్ 17న దీనిపై మరోసారి సమీక్ష నిర్వహించి నిర్మాతల మండలి నిర్ణయిస్తుందని తెలిపారు. ఇలా నష్టాల్లో కూరుకుపోయిన నిర్మాతలు తమ హక్కుల కోసం డిజిటల్ ప్రొవైడర్లతో ఫైట్ కు రెడీ అయ్యారు. మరి ఇవి నెరవేరుతాయా? మళ్లీ థియేటర్లలో బొమ్మ పడుతుందా అనేది ఉత్కంఠగా మారింది.
Tags:    

Similar News