ప్రభాస్ తో ఆమెకు గొడవైందా?

Update: 2017-02-26 11:14 GMT
తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది బాలీవుడ్ భామ కంగనా రనౌత్. అదే.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏక్ నిరంజన్’. ఈ సినిమాకు ఆమె ప్రత్యేక ఆకర్షణ అవుతుందనుకున్నారు కానీ.. అలాంటిదేమీ జరగలేదు. కంగనకు కూడా ఈ సినిమా వల్ల ఏ ప్రయోజనం లేకపోయింది. దీంతో తర్వాత మళ్లీ ఆమె తెలుగు వైపే చూడలేదు. మరే సౌత్ సినిమాలోనూ నటించలేదు కూడా. తర్వాతి కాలంలో బాలీవుడ్లో టాప్ రేంజికి వెళ్లిన కంగన.. డబ్బు కోసమే తాను ఒకప్పుడు ‘ఏక్ నిరంజన్’ చేసినట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ‘రంగూన్’ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ వచ్చిన కంగనా.. మరోసారి ‘ఏక్ నిరంజన్’ ఊసెత్తింది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా తనకు ప్రభాస్ తో గొడవైనట్లు ఆమె వెల్లడించడం గమనార్హం.

‘‘ఒకసారి నాకు.. ప్రభాస్ కు పెద్ద గొడవైంది. దీంతో మేం రోజులు మాట్లాడుకోకుండా ఉండిపోయాం’’ అని కంగన వెల్లడించింది. ఆ తర్వాత ఏమైందో చెప్పని కంగన.. ‘బాహుబలి’లో ప్రభాస్ ను చూసి తాను చాలా సంతోషించానని చెప్పింది. ‘‘బాహుబలిలో ప్రభాస్ నటన.. అతడి విన్యాసాలు చూసి చాలా గర్వించాను. అతను కూడా ఇప్పుడు నా కెరీర్ చూసి గర్విస్తూ ఉండొచ్చు’’ అని వ్యాఖ్యానించింది కంగన. ‘ఏక్ నిరంజన్’ తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు ఎందుకని కంగనను అడిగితే.. తాను సౌత్ సినిమా నేటివిటీకి పనికిరానేమో అని తనదైన శైలిలో చెప్పిందామె. గత కొన్నేళ్లలో అద్భుతమైన పాత్రలతో మెప్పించిన కంగన.. ‘రంగూన్’లోనూ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నప్పటికీ కంగన మీద మాత్రం అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News